తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా..? అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ ఎన్డిఎ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా ఎన్డిఎస్ఎకు కనిపించడం లేదా..? అని అడిగారు. కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్ -బిజెపి నేతలకు పోలవరంను.. కూలవరం అనే దమ్ము ధైర్యం ఉందా..? అని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే ఎన్డిఎస్ఎను దించి బిఆర్ఎస్పై బురదజల్లిన బిజెపి నేతలు.. కళ్లముందు రెండోసారి కొట్టుకుపోయిన పోలవరం కాఫర్ డ్యామ్ పై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.ఏకంగా 10 అడుగుల వెడల్పు.. 7 నుంచి 8 అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్ను గుట్టుచప్పుడు కాకుండా ఎపిలో యుద్ధప్రాతిపదికన రిపేర్ చేస్తుంటే..
తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బ్యారేజీ వద్ద తట్టెడు సిమెంట్కు దిక్కులేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే అని మండిపడ్డారు. 2020లో పోలవరం డయాఫ్రం వాల్ రెండేండ్లకే కొట్టుకుపోయినా ఇప్పటికీ ఊలుకూ లేదు, పలుకూ లేదని విమర్శించారు. మరోసారి ఎపిలో పోలవరం కాఫర్ డ్యామ్ గోదావరిపాలైనా, ఇటు తెలంగాణలో ఎస్.ఎల్.బి.సి. టన్నెల్ కుప్పకూలి 8 మంది మరణించినా ఇప్పటికీ ఎన్.డి.ఎస్.ఎ అడ్రస్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ నే తలదన్నే స్థాయిలో తెలంగాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి, దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతును తీర్చిదిద్దిన కెసిఆర్పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బిజెపి పార్టీలు సాగిస్తున్న మూకుమ్మడి కుట్రలను కాలరాస్తాం.. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటామని కెటిఆర్ స్పష్టం చేశారు.