హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. సిఎం రేవంత్ బుధవారం ఎపి సిఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో బనకచర్ల విషయంపై చర్చ జరగలేదని సిఎం రేవంత్ తెలిపారు. అయితే ఈ సమావేశం కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ముసుగు వీడింది, నిజం తేటలతెల్లమయ్యింది. 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయిందని కెటిఆర్ పేర్కొన్నారు. ‘‘నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు. బూడిద తెలంగాణ ప్రజలకి! బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి.. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమా నువ్వు గద్దెనెక్కింది? జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా?
కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో.. ఈరోజుతో తేలిపోయింది. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి.. తెలంగాణ విధ్వంసం కావలసిందేనా? ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు? నిన్ను ఎన్నుకున్న పాపానికి.. చెరిపేయి సరిహద్దులు! తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో! జై తెలంగాణా అనాల్సిన బాధ నీకు తప్పుతుందేమో! ఒక్క మాట గుర్తు పెట్టుకో.. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా, మరో పోరాటం చూస్తావు! ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి, తరిమి కొడతాం! ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం! తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని తప్పకపడతాం!’’ అంటూ ఎక్స్ వేదికగా కెటిఆర్ రాసుకొచ్చారు.