గ్రూప్ 1 పోస్టుల కోసం డబ్బులు చేతులు మారాయని పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపైన ప్రభుత్వం స్పందించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం గ్రూప్ 1 అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నేరుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రూప్ 1 పోస్టుల కోసం భారీగా డబ్బులను డిమాండ్ చేసినట్లు పలువురు విద్యార్థులు మీడియాలో చేస్తున్న ఆరోపణలపైన కెటిఆర్ ఒక ప్రకటనలో తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి,
తమ విలువైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వెచ్చించి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని తీవ్రంగా విమర్శించారు. హైకోర్టు ఆదేశించినట్టుగా గ్రూప్ 1 పరీక్షను మళ్లీ తాజాగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే, పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఒక జుడీషియల్ కమిషన్ వేసి, ఉద్యోగాలను అమ్ముకున్న దొంగలెవరో తేల్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇది నిరుద్యోగులకు న్యాయం చేకూర్చడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా నిరోధిస్తుందని అభిప్రాయపడ్డారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇది నిరుద్యోగుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చిందని ఆరోపించారు.
Also Read: వైట్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి: నాదెండ్ల
ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలి
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, కాసుల కక్కుర్తి కలిసి అనేక అవకతవకలకు కారణమయ్యాయని కెటిఆర్ మండిపడ్డారు. అంగట్లో కొలువులు అమ్ముకొని నిరుద్యోగుల గొంతు కోసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఒక వ్యాపారంగా మార్చిందని ఆరోపించారు. అందుకే కోట్లాది రూపాయలను తీసుకొని పోస్టులను అమ్ముకుందని పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావించారు. ఈ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అవ్వడం వల్ల యువత నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని, ఈ వైఫల్యాన్ని వారు ఎప్పటికీ క్షమించరని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్ధానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలని, కేవలం మాటలతో కాకుండా చేతల్లో చూపించి యువత ఆశలను నెరవేర్చాలని సూచించారు.