ఫోన్ ట్యాపింగ్ పేరిట పిసిసి అధ్యక్షుడు చేసిన అసత్య ఆరోపణలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహేష్ కుమార్ గౌడ్కు లీగల్ నోటీసులు పంపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు తన చేతికానీతాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
మహేష్ కుమార్ గౌడ్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా అక్రమంగా పెట్టిన కేసు విచారణకు సైతం హాజరై సహకరించామని తెలిపారు. ఆరు గ్యారెంటీలను, 420 హామీలను పూర్తిగా గాలికొదిలేసి ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని కెటిఆర్ హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే బిఆర్ఎస్ శ్రేణులు కూడా చూస్తూ ఊరుకోబోరని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని తేల్చిచెప్పారు.
ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతోనే మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని కెటిఆర్ ఆరోపించారు. ఈ లొట్టపీసు కేసుతో ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్నట్టు కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని నడిపించే సత్తా, సామర్థ్యం లేకపోవడంతోనే ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కుట్రలతో కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం రాజకీయంగా పబ్బం కడుక్కునేందుకు చేసే ఇలాంటి దుర్మార్గపూరిత వ్యాఖ్యలపైన మహేష్ కుమార్ గౌడ్ లాంటి నాయకులను కోర్టులకు ఈడుస్తామని కెటిఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా పరిపాలన పైన దృష్టి పెట్టి, అటెన్షన్ డ్రైవర్షన్ డ్రామాలను పక్కన పెట్టాలని సూచించారు. ప్రతిపక్ష నాయకులపైన ప్రాపగాండా చేయడం మానాలని అన్నారు. ప్రజలకు మంచి చేసే అంశాల పైన దృష్టి సారించాలని కెటిఆర్ హితవు పలికారు.