Saturday, May 24, 2025

నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్‌రెడ్డి పేరు..అవినీతి బండారం బయటపడిందన్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును ఇడి ప్రస్తావించడంతో సిఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఇడి నమోదు చేసిన చార్జిషీట్‌తో సిఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైందని అన్నారు. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయిందని పేర్కొన్నారు. వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సిఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరిందని ఆరోపించారు. దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఇడి కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారని దుయ్యబట్టారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి,- పొంగులేటి తరహాలో చీకట్లో బిజెపి పెద్దల కాళ్లు పట్టుకుంటారా..? అని నిలదీశారు. ఇడి కేవలం చార్జిషీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా.. లేక రేవంత్ రెడ్డిని విచారణను పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో రోజురోజుకూ పేట్రేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైందని, పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సిఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోందని అన్నారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి.. అటెన్షన్ డైవర్షన్ కోసం రోజురోజుకూ చేస్తున్న చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు తెరపడినట్టే అని పేర్కొన్నారు. సిఎం రేవంత్‌కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయయని వ్యాఖ్యానించారు.

కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయని చెప్పారు.30 శాతం పర్సెంటేజీలు ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అనిరుధ్ రెడ్డి ఆ పార్టీ బట్టలిప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని వ్యాఖ్యానించారు. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోందని విమర్శించారు. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టడమే కాకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండిందని వ్యాఖ్యానించారు. చివరికి ధర్మం గెలుస్తుంది..జై తెలంగాణ..జై కెసిఆర్ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News