Tuesday, August 12, 2025

మంత్రి బండి సంజయ్‌కు కెటిఆర్ లీగల్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి. రామారావు మంగళవారం లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కెటిఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన బండి సంజయ్ నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలపై కెటిఆర్ ఈ నోటీసులను పంపించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశ పూరితమైనవని కెటిఆర్ తరఫు న్యాయవాదులు నోటీసులో తెలిపారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజల్లో తన ప్రతిష్ఠను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు అడ్డగోలు ప్రాపగండ చేస్తున్న బండి సంజయ్ పదేపదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

బండి సంజయ్ ఆరోపణలతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆ తర్వాత మంత్రిగా తాను అనేక రంగాల్లో అద్భుతమైన సేవలు అందించానని చెప్పారు. అయితే కేంద్రమంత్రి పదేపదే చేస్తున్న వ్యాఖ్యలతో తన క్లయింట్ కెటిఆర్ పరువుకి భంగం కలుగుతుందని న్యాయవాదులు నోటీసులో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన ఏ వ్యాఖ్యలకూ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, ఒక పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి మరొక శాసనసభ్యుడిపై అసత్య పూరిత అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కెటిఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని నోటీసులో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, కెటిఆర్ తరపున బండి సంజయ్ కెటిఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు.

కెటిఆర్, అతని కుటుంబ సభ్యులపై భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని నోటీసులో డిమాండ్ చేశారు. నోటీసు అందిన ఏడు రోజులలోగా ఈ డిమాండ్లను పాటించని పక్షంలో, చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణల వల్ల కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కెటిఆర్ న్యాయవాదలు నోటీసులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News