మనతెలంగాణ/హైదరాబాద్ : బడే భాయ్, చోటే భాయ్ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారని, ఇ ద్దరూ కలిసి రాహుల్గాంధీకి పెద్ద షాక్ ఇవ్వ టం ఖాయమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సిఎం రేవంత్రెడ్డి కలిసి ఎఐసిసి అగ్రనేత రాహుల్గాంధీని ఆటలో అరటిపండుగా మార్చారని ఎద్దేవా చేశారు. పెద్ద మోదీ, చిన్న మోదీ (రేవంత్ రెడ్డి) ఒకే రకంగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ, తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలని సిఎం రేవంత్రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని ధ్వజమెత్తారు. పేదల ఖాతా ల్లో రూ.15లక్షలు వేస్తామని మోడీ.. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని రేవంత్ చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఇద్దరూ కలిసి ఒక్క హామీని కూడా ఎందుకు అమలు చే యలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ భవన్లో సోమవారం బిజెపి సీనియర్ నాయకులు అలూరి విజయభారతి, ప లువురు బిజెపి నేతలు కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అధికార కాం గ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజె పి పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా, తెలంగాణకు ద్రోహం చేయడంలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయని సంచలన ఆ రోపణలు చేశారు. రేవంత్రెడ్డి, ప్రధాని మోడీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని, దానివల్ల తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతూ, గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన భవనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడానికి తాపత్రయ పడుతున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఆ కత్తెర పట్టుకుని జాగ్రత్తగా తిరగండి సెటైర్ వేశారు. సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, గతంలో కెసిఆర్ పునాది వేసిన భవనాలను ప్రారంభించి వచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు.
మోడీ, చంద్రబాబు ఆదేశాలతోనే కాళేశ్వరం కుట్ర
కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయకపోవడం పట్ల కెటిఆర్ మండిపడ్డారు. గోదావరి నీళ్లను దిగువకు పంపి చంద్రబాబు కడుతున్న కనకచెర్ల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి తమిళనాడుకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇది మోడీ, చంద్రబాబు ఆదేశాల మేరకే జరుగుతోంది అన్నారు. మోడీ, చంద్రబాబు ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి గోదావరి నీళ్లను కిందికి పంపించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం నీళ్లు ఆగకుండా, గోదావరి నీళ్లు కిందికి వెళ్లి చంద్రబాబు కడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి తమిళనాడుకు వెళ్లాలనేది కేంద్రంలోని బిజెపి, రేవంత్కు ఇచ్చిన ఆదేశం అని, అందుకే రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పగ పట్టారని అన్నారు.
యూరియా సంక్షోభానికి కాంగ్రెస్ పాలన కారణం
రాష్ట్రంలో ఒకవైపు యూరియా కొరత ఉంటే, మరోవైపు రేవంత్ రెడ్డి సినిమా వాళ్లతో సమావేశాలు పెట్టుకున్నారని కెటిఆర్ విమర్శించారు. యూరియా కొరతకు ఆపరేషన్ సిందూర్ కారణమని బిజెపి ఎంపీలు చెబుతున్నారని, అందుకే చైనా నుంచి ఎరువులు రాలేదని అంటున్నారని పేర్కొన్నారు. అసలు మనకు చైనాతో యుద్ధం జరిగిందా..? అని అడిగారు. రేవంత్పై మాట పడకుండా బిజెపి కాపాడుతోందని ఆరోపించారు.
బిజెపి, కాంగ్రెస్లు దొందూ దొందే
తెలంగాణకు ద్రోహం చేయడంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని కెటిఆర్ అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, విభజన హామీలు – అన్నింటిలోనూ బిజెపి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. లక్షల ఉద్యోగాలు కల్పించే ఐటీఐఆర్ ప్రాజెక్టును బిజెపి రద్దు చేసిందని, హైదరాబాద్లోని డిఫెన్స్ కారిడార్ను కాదని బుందేల్ఖండ్కు తరలించిందని ఆరోపించారు. కేన్స్, మైక్రాన్ వంటి సంస్థల రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులను కూడా గుజరాత్కు తరలించారని వివరించారు. పారిశ్రామిక రంగంలో అన్యాయం, విద్యా, సాగునీటి రంగాల్లో బిజెపి తీవ్ర మోసం చేసిందన్నారు. తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజీ, ఐఐఎం వంటి విద్యా సంస్థలను కూడా బిజెపి ఇవ్వలేదని గుర్తు చేశారు.
అలాగే, పసుపు బోర్డును చిన్న రూమ్కు పరిమితం చేసిందని, కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వలేదని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలు దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఎనిమిది చొప్పున ఎంపీ స్థానాలను పంచుకున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి హామీల వైఫల్యాలపై బిజెపి ఎంపీలు ఏనాడు ప్రశ్నించడం లేదని అన్నారు. కానీ రేవంత్కు రక్షణగా కెసిఆర్పై మాత్రం విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అమృత్ స్కాం, హెచ్సియు భూముల స్కామ్లపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని కెటిఆర్ ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలి
గత పదేళ్లలో కెసిఆర్ చేసిన పాలనను ప్రజలు మర్చిపోయారని, అందుకే ఇప్పుడు యూరియా వంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలు నమ్మి మోసపోవద్దని తాము ఆరోజు విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అందరినీ మోసం చేస్తోందని పేర్కొన్నారు. 20 నెలల కాంగ్రెస్ పాలన నచ్చకుంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజలు తీర్పు ఇవ్వాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.