బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయని, ఏదో ఒకటి చేసి కెసిఆర్ను బదనాం చేయాలని చూస్తున్నాయని కెటిఆర్ ఆరోపించారు. దున్నపోతు ఈనిందంటే దుడ్డేను కట్టేయమన్నట్టుగా అసత్య ఆరోపణలు చేస్తూ నోటీసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎలాగైనా తమను ఇరిటేట్ చేయాలని నోటీసులు ఇస్తున్నారని, తాము ఇప్పటికే ఈ అంశంలో చెప్పాల్సినదంతా స్పష్టంగా చెప్పామని పేర్కొన్నారు. సోమవారం కమిషన్ ముందు హరీష్ రావు పూర్తి అంశాలు వివరించారని, కొత్తగా కెసిఆర్ చెప్పేదేమీ ఉండదని తెలిపారు. భాక్రా నాగల్, నాగార్జున సాగర్, నర్మద, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులు నిర్మించడానికి దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్నాయని, కానీ కెసిఆర్ మాత్రం కేవలం నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ను పూర్తిచేశారని గుర్తు చేశారు.
ఇది సాధారణ విషయం కాదు అని, మరో దేశంలో ఇలా జరిగి ఉంటే కెసిఆర్కు సమున్నత పురస్కారాలు వచ్చేవని అన్నారు. కానీ మన దేశంలో మాత్రం బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంతటి భారీ ప్రాజెక్టును రికార్డు సమయంలో కట్టినందుకు ఇబ్బందులకు గురి చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధ్వంసకర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రస్తుతం నడుస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, పదవుల్లోకి రాగానే ప్రజలను మోసం చేశారని అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసకర ఆలోచనలతో నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే వారెవరు తమ పార్టీలో లేరని కెటిఆర్ పునరుద్ఘాటించారు. మీడియా మేనేజ్మెంట్తో ప్రధాని మోదీ దృష్టిలో పడేందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు.