హైదరాబాద్ మీదకే కాదు…అడవి మీదకూ బుల్డోజర్లు వెళుతున్నాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలు అన్న ప్రేమ లేదు..ఆడబిడ్డలు అన్న ఇంగితం లేదని విమర్శించారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసి పొట్టపోసుకుంటున్న ఆదివాసీల మీద దాడి చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఆదివాసీల మీద దాడి అమానుషం అని ధ్వజమెత్తారు. 420 హామీలను అమలు చేయలేక .. ఇవ్వని హామీలు హైడ్రా, మూసా ప్రక్షాళన పేరుతో హైదరాబాద్లో పేదల ఇండ్లు కూల్చడం,
రోడ్ల విస్తరణ, పరిశ్రమలకు భూసేకరణ పేరుతో లగచర్ల, దిలావర్ పూర్, పెద్ద ధన్వాడ, చారగొండ, సిరసనగండ్లలో రైతుల పొలాల్లోకి, ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపుతున్నారని అన్నారు. ఇప్పుడు పట్నం, పల్లెలు దాటి అడవుల మీదా, ఆదివాసీల మీదా కాంగ్రెస్ సర్కార్ పడిందని మండిపడ్డారు. ప్రశ్నిస్తే, ఎదిరిస్తే, నిలదీస్తే నిర్ధాక్షిణ్యంగా కేసులు నమోదు చేస్తూ జైళ్లలో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 420 హామీలు పక్కకు .. కూల్చే, కాల్చే కాంగ్రెస్ పథకాలు ముందుకు…జాగో తెలంగాణ జాగో అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.