మన తెలంగాణ / హైదరాబాద్ : తన ఎన్నిక చెల్లందంటూ వేసిన ఎన్నికల పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం పట్ల కొత్తగూడెం శాసనసభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ప్రజాక్షేత్రంలో గెలుపొందడం ద్వారా ప్రజా విజయం సాధించామని తాజాగా అసంబంధమైన అంశాలతో వేసిన కేసును హైకోర్టు కొట్టివేయడం ద్వారా న్యాయం గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.
హైకోర్టు తీర్పుపై తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన స్పందించారు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థ పట్ల మరింత విశ్వాసం, గౌరవం ప్రజల్లో పెరిగిందన్నారు. లక్షలాది మంది ఓట్లు వేసి గెలిపిచిన వారి మనోభావాలకు భిన్నంగా అడ్డదారుల్లో ప్రయోజనం పొందాలనుకునేవారికి ఈ తీర్పు చక్కని గుణపాఠం అని ఆయన హెచ్చరించారు. న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్పు ప్రజా సేవలో ద్విగుణీ కృతమైన ఉత్సహంతో పనిచేసేందుకు మరింత స్పూర్తిని కలిగించిందని సాంబశివరావు తెలిపారు.