ఢిల్లీలో మూడు రోజుల పాటు లాల్ దర్వాజా బోనాలు నిర్వహించనున్నట్టు శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వర్గాలు, సింహవాహిని మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సింహవాహిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు జూన్ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఢిల్లీలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించను న్నట్లు వారు పేర్కొన్నారు. జూన్ 30 వ తేదీన తెలంగాణ భవన్లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు.
జూలై 1 వ తేదీన ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుందని వారు వెల్లడించారు. జూలై రెండో తేదీన పోతురాజు, కళాకారుల నృత్యాలు ఉంటాయని, పదేళ్ల నుంచి ఢిల్లీలో తెలంగాణ భవన్లో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వారంతా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని వారు ఆహ్వానం పలికారు. లాల్ దర్వాజా బోనాలు ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో పలువురు ప్రముఖులు రాబోతున్నారని సింహవాహిని మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.