ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పితోరాగఢ్ జిల్లా సమీపంలో కైలాస్ మానసరోవర్ యాత్ర మార్గం లో అవి విరిగిపడడటంతో వందలాది యాత్రికులు చిక్కుకుపోయారు. వారితోపాటు స్థానికులు కూడా ఉన్నారు. ఆ మార్గాన్ని అందుబాటు లోకి తెచ్చే విధంగా స్థానిక యంత్రాంగం సహాయ చర్యలు ప్రారంభించింది. శిథిలాలను తొలగించేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందం అక్కడకు చేరుకుంది. తాజా ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, అధికారులు వెల్లడించారు. పరిస్థితులు మెరుగుపడేవరకు యాత్రికులు అక్కడే ఉండాలని, సూచించారు. ఐదేళ్లుగా నిలిచిపోయిన కైలాస్ మానసరోవర్ యాత్రను ఈ ఏడాది జూన్ నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గత నెల అధికారికంగా ప్రకటించింది. జూన్ నుంచి ఆగస్టు వరకూ కొనసాగనున్న ఈ యాత్ర ఉత్తరాఖండ్, సిక్కింలలో ప్రారంభం కానుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
50 మంది యాత్రికుల చొప్పున 5 బృందాలు ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ నుంచి, 10 బృందాలు సిక్కిం నాధులా పాస్ నుంచి ఈ యాత్రకు తరలివెళ్తాయి” అని వెల్లడించింది. యాత్రకోసం దరఖాస్తులను kmy.gov. in లో సమర్పించ వచ్చని కంప్యూటర్ జనరేటెడ్ విధాపం ఆధారంగా యాత్రికులను ఎంపిక చేస్తామని పేర్కొంది. కొవిడ్ కారణంగా కైలాస్ పర్వతం, మానసరోవర్ సరస్సు యాత్ర 2020 లో ఆగిపోయింది. ఆ తర్వాత గల్వాన్ కారణంగా భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో యాత్ర పునరుద్ధరణ చర్యలు ముందుకు సాగలేదు. గత ఏడాది రష్యాలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల భేటీ అనంతరం ఇరు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చే చర్యలు మొదలయ్యాయి