హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చిక్కుల్లో పడ్డారు. ఆయనకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రావు లీగల్ నోటీసులు పంపించారు. బిజెపి అధ్యక్షుడిగా రామచంద్ర రావు నియామకంపై భట్టి పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై లీగల్గా చర్యలు తీసుకొనే క్రమంలో తన అడ్వకేట్ విజయ్ కాంత్తో నోటీసులు పంపించారు. భట్టి విక్రమార్క మూడు రోజుల్లో బేషరుతుగా క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని నోటీసుల్లో హెచ్చరించారు. అంతేకాక క్రిమినల్ కేసులు ఎదురుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా రామచంద్ర రావు నియామకాన్ని పునరాలోచన చేయాలని భట్టి (Bhatti Vikramarka) ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దళితులు, గిరిజనులను వేధించిన వారికి బిజెపి ఉన్నత పదవులు ఇస్తుందనడానికి రామచంద్ర రావు ఎంపికే ఉదాహరణ అని ఆయన అన్నారు. హెచ్సియులో రోహిత్ వేముల ఆత్మహత్యకు కూడా రామచంద్ర రావు కారణమని ఆరోపించారు. ఆయనకు తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి రివార్డు ఇచ్చారని, దానిపై పునరాలోచన చేయాలని భట్టి పేర్కొన్నారు.