తొలుత జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు ఆ తరువాత పంచాయతీ,
మున్సిపల్ పోరు కేబినెట్లో చర్చించాకే ఎన్నికల తేదీపై స్పష్టత స్థానిక
ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడి
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/కూసుమంచి: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ఈనెలాఖరులోగా షెడ్యూల్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనప్రాయంగా వెల్లడించారు. ఆదివారం ఖ మ్మం జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహించే పా లేరు నియోజకవర్గం, కూసుమంచి మండల కేం ద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పా ర్టీ ముఖ్యనేతలతో ఆయన భేటీ అయ్యారు. మండలాల వారీగా సమావేశాలను నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడు తూ.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ జారీ అవుతుందని, సోమవా రం కేబినెట్ సమావేశంలో చర్చించిన తరువాత ఎ న్నికల తేదీపై స్పష్టత ఇస్తామని అన్నారు. తొలు త ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించిన అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలకు వెళ్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల గడువు సమీపిస్తుస్తున్నందు వల్ల నాయకులంతా కలిసికట్టుగా పార్టీ విజయం కోసం కష్టపడాలన్నారు. ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉం డాలని, నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.
గ్రామాల్లో పార్టీ నేతలు, శ్రేణుల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తామని అన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిజేర్చామని, వాటిని ఇంటింటికీ తీసుకెళ్ళాలని సూచించారు. ఆయా గామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు… వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా స్థానిక నేతలు బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు.