న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని దేవ్ప్రయాగ్, జనసు మధ్య 14.57 కిమీ.ల విస్తీర్ణం ఉన్న భారత్లోని అతి పొడవైన రైలు సొరంగంను పూర్తిచేశారు. హిమాలయ పర్వత ప్రాంతంలో ఇద్దరు మెషిన్ ఆపరేటర్లు రాత్రింబవళ్లు తొలిచి ఈ సొరంగంను పూర్తిచేశారు. ఈ సొరంగం ప్రతిష్టాత్మకమైన 125 కిమీ. రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు లింక్ ప్రాజెక్ట్లో భాగం, దీనిని రైల్వే మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2026 నాటికి అమలులోకి తీసుకురాడానికి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కు అప్పగించారు.
జర్మన్ తయారీ టిబిఎం మెషిన్తో ఈ సొరంగాన్ని తవ్వారు. కాగా టిబిఎంను హిమాలయ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టుకు తొలిసారి ఉపయోగించినట్లు ఎల్ అండ్ టి అధికారులు తెలిపారు. సొరంగంలో టిబిఎంను ఆపరేట్ చేయడం అన్నది అంత సులభ సాధ్యం ఏమి కాదని ఆపరేటర్ బల్జీందర్ సింగ్(44) తెలిపారు. ఆయనతో పాటు ఆయన సహచరుడు రామ్ అవతార్ సింగ్ రాణా(52) కూడా ‘శక్తి’ అనే జర్మన్ టిబిఎంను ఆపరేట్ చేశారు.