Monday, June 16, 2025

వచ్చే ఎన్నికల్లో బిసి సిఎం ఖాయం

- Advertisement -
- Advertisement -

ఇప్పటివరకు పార్టీలకు ఓటు
బ్యాంకుగానే ఉన్న బిసిలు
కులగణనతో మా వాటా మాకు
కావాలని నినాదం కామారెడ్డి
డిక్లరేషన్‌కు అనుగణంగా
బిసిలకు 42శాతం రిజర్వేషన్లకు
చట్టబద్ధత కల్పిస్తాం ఓబిసి
పోరుబాట పుస్తకావిష్కరణలో
పిసిసి అధ్యక్షుడు
మహేశ్‌కుమార్ గౌడ్

మన తెలంగాణ/హైదరాబాద్/నాంపల్లి : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిసి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పిసిసి అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీలకు అతీతంగా బిసిలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైన ఉందని అయన పిలుపునిచ్చారు. శనివారం నాంపల్లి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి (ప్రిన్సిపల్ సెక్రెటరీ) పరికిపండ్ల నరహరి, అడ్వకేట్ పృద్వీరాజ్‌సింగ్ పరమాల్ రచించిన “ఓబిసిల పోరుబాట” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ బిసిల్లో ఐక్యత లోపించిందని, రాష్ట్రంలో కులగణన తర్వాత మెజారిటీగా ఉన్న బిసిలు ఒకతాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా ఐక్యంగా పనిచేయాలని కోరారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పకడ్బందీగా నిర్వహించిన కులగణనతో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు.

ఇప్పటి వరకు రాజకీయపార్టీలు చాలా వరకు బిసిలను ఓటు బ్యాంకుగానే చూశారు, కులగణన తర్వాత మా వాటా మాకు కావాలి అనే స్థాయికి బిసిలు ఎదిగారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి సమక్షంలో రాష్ట్రంలో జరిగిన కులాల సర్వేపై దేశ వ్యాప్తంగా ఉన్న 450 పైగా కాంగ్రెస్ ప్రతినిధులకు తాను పవర్ పాయింట్ ప్రజంటేషన్(పిపిపి) ఇచ్చి సమగ్రంగా వెల్లడించినట్లు చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ అనుగుణంగా బిసిలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం చట్ట బద్దత కల్పిస్తుందని, పార్టీ నేత రాహుల్ గాంధీ ఆశయం మేరకు కుల సర్వేను శాస్త్రీయ బద్దంగా నిర్వహించారని తెలిపారు.

పోరాడితే వచ్చేవి హక్కులు : ఈటల
అడుక్కుంటే వచ్చేది కాయో, పండు కానీ పోరాడితే మాత్రం వచ్చేది మాత్రం హక్కులు, అధికారం అని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ తెలిపారు. అణిచివేతకు గురైన వారు మాత్రమే సంఘాలు ఏర్పాటు చేసుకుని తమ హక్కులు కోరుతారు, అలాంటి వారే పుస్తకాలు రాస్తారు, ఉద్యమాలు చేస్తారని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ రాజ్యం, రాజ్యాంగం ఎవరి చేతిలో ఉందనే దానిమీద ఆధారపడే రేపటి ఫలితాలు ఉంటాయని చెప్పిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఇంజనీరింగ్, ఐఏఎస్, డాక్టర్ ఏది కావాలన్నా మెరిట్ ఉండాలి కానీ, రాజకీయ నాయకులకు కూడా మెరిట్ ఉండాలనేది తన అభిప్రాయమన్నారు. అదికూడారాజ్యాంగ స్ఫూర్తిని సమగ్రంగా అర్థం చేసుకునే మెరిట్ కావాలి. ఒకప్పుడు విద్యార్ధి సంఘాలు ఉండేవి కానీ, ఈ రోజుల్లో విద్యార్థులు కంప్యూటర్ మైకంలో పడుతున్నారన్నారు. వారిలో సామాజిక స్పృహ తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బిసిలు హక్కుల కోసం ఉద్యమించాలి: నరహరి
బిసిల్లో ఆత్మ న్యూనత భావం పెరిగిపోతోందని, ఓబిసి సమాజానికి సరైన దిశ నిర్దేశం చేయాల్సిన అవసరం ఎతైన ఉందని ఓబిసిల పోరుబాట పుస్తక రచయిత, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పి.నరహరి పిలుపు ఇచ్చారు. బిసిలందరూ తమ కులాలను పక్కనపెట్టి సంఘటితంగా బిసి హక్కుల కోసం ఉద్యమించాలని, సంఘటిత శక్తిగా ద్యమిస్తే దానంతట అదే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం చేసే కులగణన ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో యాబై శాతానికి పైగా ఉన్న ఓబిసిలు రాష్ట్ర చట్టసభల్లో ఆమేరకు ప్రాతినిధ్యం లేదన్నారు. వెనుకబడినతరగతుల్లో చైతన్యం నిండుగా ఉందని, అయితే కలిసి పనిచేయడంలోనే వెనుకంజవేస్తున్నారని రిటైర్డ్ ఐపిఎస్ అధికారి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు.

మెజారిటీ బిసిలు పాలకులుగా ఉంటే తప్ప పూర్తిస్థాయిలో న్యాయం జరిగే అవకాశం లేదన్నారు. ఇందుకు ఇటీవల రాష్ట్రంలో జరిగిన సమాచార హక్కు కమిషనర్ల నియామకాలు నిదర్శనమన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఓబిసిల పోరుబాట పుస్తకంలోని తొమ్మిది అధ్యయనాలను సభకు పరిచయం చేస్తూ అందులోని ముఖ్యాంశాలను సభకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్, బిసి కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, ప్రొఫెసర్ జయశంకర్ అధ్యయన వేదిక అధ్యక్షుడు వి.ప్రకాష్ తదితరులు పాల్గొనగా, సహ పుస్తక రచయిత అడ్వకేట్ పృద్వీరాజ్‌సింగ్ పరమాల్ వందన సమర్పణ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News