పశ్చి బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా విదేశాల్లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. బిజూ జనతా దళ్( బిజెడి) మాజీ ఎంపి, సీనియర్ న్యాయవాది పినాకీ మిశ్రాను ఈ నెల 3న జర్మనీలో వివాహం చేసున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. సంప్రదాయ దుస్తులు ధరించి , బంగారు ఆభరణాలతో అందంగా ముస్తాబయిన మొయిత్రా మిశ్రా చేయిపట్టుకుని ఉన్న ఫోటో వైరల్ అయింది. అయితే మహువాతో పాటుగా టిఎంసి కూడా ఆమె పెళ్లి విషయమై అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కాగా అసోంలో జన్మించిన మొయిత్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించారు. 2010లో మమతా బెనర్జీ పార్టీలో చేరారు. తొలుత బెంగాల్లోని కరీంపూర్ ఎంఎల్ఎగా గెలిచారు. అనంతరం 2019లో పశ్చిమ బెంగాల్లోని కృష్ణనగర్ నియోజకవర్గం
నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి లోక్సభకు తొలిసారి ఎంపికయ్యారు.2024లో పార్లమెంటులో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో ఆమె లోక్సభ సభ్యత్వం కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అదే నియోజకవర్గంనుంచి 50 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొయిత్రా తొలుత డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రూసెన్ను వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత విడాకులు తీసుకున్నారు.అనంతరం న్యాయవాది జై అనంత దేహద్రాయ్తో మూడేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు. అయితే అతను మోసం చేసే ప్రేమికుడని ఆమె ఆరోపించింది. మరో వైపు బిజూ జనతాదళ్ సీనియర్ నేతఅయిన మిశ్రా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. ఒడిశాలోని పూరీ నియోజకవర్గంనుంచి నాలుగు సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు.