గుజరాత్ అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఫ్లయిట్ నెంబర్ ఎఐ171 విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. సంఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో భారత్లో జరిగిన విమానాల ప్రమాదాల్లో ఇది భారీదని నిపుణులు భావిస్తున్నారు. గతంలో జరిగిన భారీ విమాన ప్రమాదాలు ఇవే …
2020 కరోనా మహమ్మారి సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బోయింగ్ 737800 విమానం దుబాయ్ నుంచి కేరళ లోని కొయ్కోడ్కు బయలుదేరింది. అదే సమయంలో భారీ వర్షం కారణంగా ప్రమాదం జరిగింది. 30 అడుగుల లోయలో పడి విమానం రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్ల సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు.
2010 మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం ఐఎక్స్ 812 కుప్పకూలింది. ఇది అత్యంత భారీ ప్రమాదం. 166 మంది ప్రవాస భారతీయులు ఉన్న ఈ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చింది. సకాలంలో రన్వే పై ఆగలేకపోయింది. రన్వే దాటి లోయలోకి దూసుకెళ్లింది. మంటలు చెలరేగడంతో 158 మంది మృతి చెందారు. వీరిలో 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
1998 జులైలో ఆలయన్స్ ఎయిర్ ఫ్లైట్ బోయింగ్ 7372ఎ 8 విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. జనాలు ఉన్న ప్రాంతం లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన బీహార్ లోని పాట్నా విమానాశ్రయం సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు మరణించగా, మరో ఐదుగురు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు.
1996 హర్యానా లో మరో ఘోర ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానం 763, కజికిస్థాన్ ఎయిర్లైన్స్ విమానం,1907 ఢీకొన్నాయి. సమాచారం లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. రెండు విమానాల్లో 340 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది మరణించారు.
1993 ఏప్రిల్లో మహారాష్ట్ర లోని ఔరంగాబాద్, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్కు చెందిన విమానం టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైంది. రన్వేపైకి వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 118 మంది ప్రయాణికులు, సిబ్బంది 55 (గ్రౌండ్ సిబ్బందితో కలిపి ) ప్రాణాలు కోల్పోయారు.
బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605 కుప్పకూలింది. రన్వేను తాకడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన 1990 ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. నాడు ఈ ప్రమాదంలో 146 మంది ప్రయాణికులు, 92 మంది సిబ్బంది చనిపోయారు. 1988 అక్టోబర్ 19న ఉదయం 6.05 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్ బోయింగ్ 737200 విమానం కూలి 133 మంది మరణించారు.
భారత్లో తొలి విమాన ప్రమాదం 1938లో
భారత్లో తొలిసారిగా విమాన ప్రమాదం 1938 లో జరిగింది. 1938 మార్చి 7న మధ్యప్రదేశ్ లోని డాటియాలో ఫ్రాన్స్ ఎయిర్లైన్ విమానం కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు.
1943 ఆగస్టు 14న టాటా నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన వీటీ ఏక్యూడబ్లు విమానం మహారాష్ట్ర లోని లోనావాలా లో కుప్పకూలి ఆరుగురు మృతి చెందారు.
1949 జులై 12న ముంబై నగరంలో ఘాట్కోవర్ సమీపంలో విమానం కూలి 45 మంది చనిపోయారు. ఇండోనేసియా లోని జకార్తా నుంచి నెదర్లాండ్స్ లోని అమ్స్టర్డామ్కు వెళ్తున్న లాక్హీడ్ కాన్సల్టేషన్ విమానం లాండింగ్ సమయంలో కూలిపోయింది. మృతుల్లో 35 మంది ప్రయాణికులు కాగా, 10 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో అమెరికన్ జర్నలిస్ట్ హెచ్ఆర్ నికర్బాకర్ కూడా మరణించారు.