కాలం/ టైమ్ అనేది అమూల్యమైనది. అలా అని అది కిరాణ కొట్టులో దొరికే వస్తువు కాదు. చేజారిన కాలం మళ్ళీ రాదు. రాబోయే కాలం ఎలా వుంటుందో ఎవరూ ఊహించలేరు. ఒకవేళ మీరు ఏదైనా ప్రణాళికను వేసుకొని దానికనుగుణంగా రేపటి నుండి ప్రారంభిద్దాం అనుకుంటే పొరపాటు. అది ఈ రోజే ప్రారంభించండి. మహాత్మ గాంధీ కాలం గూర్చి చెప్తూ రేపు చేసేది ఈరోజే చేయండి. ఈ రోజు చేసేది ఇప్పుడే ప్రారభించండి అంటారు. అంటే కాలం విలువ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. టైమ్ తన పనిని రాత్రి 12:00 గంటలకి ప్రారంభిస్తుంది. తిరిగి 0:00 గంటలకి ముగుస్తుంది. కాలం ఎలాంటిది అంటే వర్తమానంలో ఉన్న మనల్ని భవిష్యత్తులోకి వెళ్ళనివ్వదు. అలాగని గతంలోకి వెళ్ళనివ్వదు. అంటే ఉన్న సమయాన్ని ఉన్నపళంగా సద్వినియోగం చేసుకోవాలి. లేనిపక్షంలో రేపటికి ఈ భూమిపై మీ ఆనవాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు లేదా మీ మనస్సు మారిపోవచ్చు.
అందుకే ఏదైనా అనుకున్న మరుక్షణమే ఆ పనిని ప్రారంభించండి దాని ఫలితాన్ని ఆస్వాదించండి. ఆనందం సృష్టి నియమం, బాధ మనిషికి ఎప్పుడైన రావచ్చు. కానీ అది ఎల్లకాలం మనిషిని చుట్టుకొని వుండదు. ప్రతి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏదొక కారణంతో సుమారు 1,50,000 మంది మరణిస్తున్నారని ఓ అంచనా. మీరు అందులో ఎలాంటి విజయం/గుర్తింపు దక్కకుండానే కాలగర్భంలో కలిసి పోవాలనుకుంటున్నారా? అందుకే సూర్యాస్తమయం అయ్యేలోపు మీ పనులను పూర్తి చేయండి. రేపు మీరు ఆరోగ్యంగా లేస్తారన్న గ్యారంటీ కార్డు (Guarantee card) మీ జేబులో ఉందా? అలా వుంటే ప్రపంచంలో జరిగిన సైన్సు ఆవిష్కరణలు అన్నీ వాయిదాపడేవే. కురుక్షేత్రంలో 17వ రోజు అర్జునుడికి కర్ణుడికి మధ్య జరిగిన యుద్ధంలో ఇద్దరు అనేక రకాల అస్త్రశస్త్రాలతో యుద్ధం చేస్తున్న క్రమంలో సాయంత్రం అవుతుంది. చీకటి పడ్తే యుద్ధం ముగించాల్సి వుంటుంది (యుద్ధ నియమం). అంటే సూర్యుడు అస్తమించేలోపే కర్ణుని వధ జరగాలని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆదేశిస్తాడు.
కానీ కర్ణుడు భూమిలో కుంగిన రథాన్ని పైకి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నియమాల ప్రకారం ఎదుటి వ్యక్తి చేతిలో అస్త్రం ఉంటేనే యుద్ధం చేయాలి. కానీ ఆ రోజు యుద్ధంలో కర్ణుడు మరణించకపోతే రేపటి పరిణామాలు ఎలా ఉంటాయో కృష్ణుడికి తెలుసు కాబట్టే అర్జుడిని ప్రేరేపిస్తాడు. అలా కర్ణుడి వధ జరుగుతుంది. ఇందులో వేరే ఉద్దేశం లేదు ఇక్కడ మీరు ఆలోచించడానికి సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఉన్న తేడా ఒక్కటే. రోజు ముగిస్తే రేపటి పరిణామాలు ఎలా ఉంటాయో ఊచించటం కష్టం. కాబట్టి ఇప్పటికే మీరు ఎంతో విలువైన కాలాన్ని వృథా చేసి వుంటారు. గత కాలం మేలు వచ్చు కాలం కంటెన్ అంటాడు ఆది కవి నన్నయ్య. అంటే గడిచిన కాలం ఎంత విలువైనదో, రాబోయే కాలం ఎలా వుంటుందో, ఎంత దుర్భరంగా వుంటుందో ఊహించలేం. గతాన్ని వదిలేసి వర్తమానంలో మీరు ఏం చేయదలచుకున్నారో స్పష్టంగా ఓ గిరి గీసుకోండి మీకున్న సమయంలోనే రేపటి గురించి (భవిష్యత్తు) ఆలోచించకుండా ఈ రోజును ఆనందంగా, ఆశావాద దృక్పథంలో ముగించండి.
రేపు అనేది మీకు లభించబోయే బోనస్ అది సూర్యోదయం అయిన తరువాత మీకు చాయిస్ (అవకాశం) ఇస్తుంది. అలాగే ప్రశ్నిస్తుంది కూడా. ఈ రోజు ఎలా గడుపుతున్నావు అని. అందుకే కాలాన్ని వృథా చేయకండి. కాలం అనే ఇసుక తిన్నెలపై నీ పాదముద్రలు కనిపించాలంటే ఈసురోమంటూ నడుచుకుంటూ వెళ్ళకు అంటాడు అబ్దుల్ కలామ్. మన వ్యక్తిత్వం మన చుట్టూ వున్న వ్యక్తులకు, మన కాలం నాటి సమకాలికులపై ప్రభావం చూయించేలా వుండాలి, ఎదో పుట్టామా చచ్చామా అన్నట్లు కాకుండా ఉండాలి. కాలం నిన్ను ఉన్నోడివా, లేనోడివా, ఏ కులం, ఏ మతం నీదని అడగదు. దానికి నువ్వు విలువ ఇస్తే గెలుస్తావు. లేకపోతే అక్కడే ఆగిపోతావు. అందుకే ప్రతి సెకను విలువ తెలుసుకొని జాగ్రత్తగా అడుగులువేయ్. అప్పుడు ఆ రోజు కూడా నిన్ను చూసి సంతృప్తి పడుతుంది.
- డా. మహ్మద్ హసన్, 99080 59234