Tuesday, June 10, 2025

చల్లారని అసమ్మతి

- Advertisement -
- Advertisement -

రెండోరోజూ అసంతృప్తులతో చర్చలు అయినా వీడని అలకలు
మూకుమ్మడిగా రాజీనామా చేసిన ఎంఎల్‌ఎ సుదర్శన్‌రెడ్డి
అనుచరులు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్
భూస్థాపితమేనని హెచ్చరిక కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి
పదవులు ఇవ్వడమేమిటి?: మల్‌రెడ్డి ప్రేమ్‌సాగర్ రావును కలిసి
మంతనాలు జరిపిన డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి పొన్నం

మనతెలంగాణ/హైదరాబాద్/బోధన్: రాష్ట్ర కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ చిచ్చు రాజేసింది. మంత్రిపదవి ఆశించి భంగపడిన సీ నియర్ నేతలు ఇంకా అలకవీడలేదు. రెండోరోజూ కూడా అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క లు రంగంలోకి దిగారు. మల్‌రెడ్డి రంగారెడ్డిని మంత్రి శ్రీధర్‌బాబు కలవగా ప్రేమ్‌సాగ ర్ రావును డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. వీరితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు సోమవారం ఎవరిని కలవడానికి ఇష్టపడలేదని వారిని బుజ్జగించడానికిప్రయత్నించిన మంత్రులు, కాం గ్రెస్ సీనియర్ నాయకులకు వారు అందుబాటులోకి రాలేదని తెలిసింది. మం త్రి వర్గంలో స్థానంపై గంపెడాశలు పెట్టుకున్న సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి రం గారెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు అధిష్ఠానం నిర్ణయం తో షాక్‌కు గురయినట్టుగా సమాచారం.

మొదటిరోజు అసంతృప్తులతో మీనా క్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ బుజ్జగింపులు చేసినా, పెండింగ్‌లో మరోమారు జరిగే విస్తరణలో తప్పక అవకాశం ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా వారు తమ అలక వీడటం లేదని తెలిసింది. తాజా పరిణమాలు మింగుడుపడని ఆసంతృప్త నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వగా మంత్రిపదవి ఇస్తామన్న షరతుతోనే పార్టీలో చేరిన తనకు ఆ పోస్టు ఇవ్వకపోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక తన జిల్లాకు అన్యాయం చేస్తే ఊరుకునేదే లేదని, మంత్రి వర్గంలో తన జిల్లా వాళ్లకు చోటు కల్పించాల్సిదేనని మల్ రెడ్డి రంగారెడ్డి పట్టుబడుతుండడం విశేషం. ఈ పరిణామాలతో మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తే ఎలా: మల్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏళ్లుగా పార్టీ జెండానే నమ్ముకుని పనిచేస్తున్న వాళ్లకు పదవులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కొత్తగా పార్టీలోకి వచ్చని వాళ్లకు పదవులు ఇచ్చుకుంటూ పోతే పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తల విశ్వసనీయత దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలను విస్మరించారని 10 ఉమ్మడి జిల్లాలకు ఒక్కో మంత్రి పదవి ఉండాలన్నారు. తాను ఇప్పటికీ పదవీ త్యాగానికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు.

బోధన్ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం
తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్, కామారెడ్డి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో స్థానిక నేతల్లో అలజడి మొదలైంది. మాజీమంత్రి, బోధన్ ఎంఎల్‌ఎ సుదర్శన్ రెడ్డి అనుచరులు నియోజకవర్గంలో రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ పార్టీకి, పలు పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు నేతలు ప్రకటించారు. ఇందులో భాగంగా సోమవారం నియోజకవర్గంలోని నవీపేట్, రెంజల్, ఎడపల్లి, సాలూర బోధన్ మండలాలతో పాటు బోధన్ పట్టణ ముఖ్య నాయకులు హైదరాబాద్ తరలివెళ్లారు. పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు ఎంఎల్‌ఎను కలిసి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. పదేళ్లపాటు పార్టీ జిల్లాలో బతికి ఉందంటే మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి నాయకత్వమే కారణమని వారు అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న ముఖ్య నేతలను కాదని, పార్టీలు మారి వచ్చే నేతలకు పదవులు ఇవ్వడం ఏమిటని

బోధన్ నియోజకవర్గ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి పదవులు అనుభవించే నేతలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని పిసిసి డెలిగేట్ గంగాశంకర్ ప్రశ్నించారు. ఏళ్ళ తరబడి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉన్న సుదర్శన్ రెడ్డిని ఎలా విస్మరిస్తారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాకు ముఖ్య నేతగా గుర్తింపు ఉన్న సుదర్శన్ రెడ్డి పట్ల అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ పట్ల నమ్మకం కోల్పోయేలా అధిష్టానం వ్యవహరించడం సరైంది కాదని వాపోయారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో పార్టీ భూస్థాపితం అవుతుందని మండిపడ్డారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఎవరు ముందుకు నడుపుతారని ప్రశ్నించారు. తక్షణమే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు తరలిన వారిలో నియోజకవర్గ నాయకులు పాష మొయినుద్దీన్, మోబిన్ ఖాన్, పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, నాగభూషణ్ రెడ్డి, శరత్ రెడ్డి, నాగేశ్వరరావు, శీల శంకర్, గణపతి రెడ్డి, రామచందర్, సంజీవరెడ్డి, అల్లే రమేష్, జావిద్, హరికాంత్ చారి తదితరులు ఉన్నారు.

నేడు బంద్‌కు పిలుపునిచ్చి వెనక్కి తగ్గిన నేతలు
ఎంఎల్‌ఎ సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అధిష్టానం తీరును నిరసిస్తూ మంగళవారం బోధన్ బందుకు పిలుపునిచ్చారు. కానీ ఆ వెనువెంటనే బంద్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుత పరిస్థితుల పట్ల తీవ్ర నైరాశ్యం నెలకొంది. పార్టీలో కష్టపడే వారికి పదవులు ఇవ్వకుండా అధికారంలో ఉన్న పార్టీలో అన్ని అనుభవించి పార్టీలు మారే వ్యక్తులకు పదవులు అప్పగిస్తున్నారని మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News