చిట్టీల పేరుతో ఘరానా మోసం చేసిన ఓ వ్యాపారి కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన నల్లగొండ జిల్లా, మిర్యాలగూడలో ఆలస్యంగా వెలుగుచూసింది. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేస్తే గద్దలా తన్నుకుపోయాడని బాధితులు వాపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని శాంతినగర్కు చెందిన కటకం సైదిరెడ్డి గత 30 ఏళ్లుగా నమ్మకంగా కమీషన్పై చిట్టీల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గతంలో చిట్టీలు పాడిన వారికి డబ్బులు చెల్లించకపోగా, కొత్త చిట్టీలు ప్రారంభించి, అడిగినవారికి వడ్డీలు చెల్లిస్తూ నెట్టుకొచ్చాడు. చివరికి ఎవరికీ డబ్బులు చెల్లించకుండా చిట్టీల డబ్బులు కుటుంబ సభ్యులతో కలిసి కోటిన్నర రూపాయలతో పారిపోయాడు. చిట్టీ నిర్వాహకుడు బియ్యం వ్యాపారి. 30 ఏళ్ల నుండి ఇదే వ్యాపారం చేస్తూ, స్థానికులకు నమ్మకం కలిగిస్తూ పరిచయాలు పెంచుకొని, చిట్టీ వ్యాపారం మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. ఆయా గ్రూప్ సభ్యుల్లో ఎక్కువమంది పేద, మధ్యతరగతివారే ఉన్నారు. అతనిపై నమ్మకం పెరగడంతో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులను కూడా చేర్పించారు.
ఒక్కో ఇంట్లో సుమారు ముగ్గురు చిట్టీల్లో చేరగా, చిట్టీ పాడిన పలువురికి వచ్చిన డబ్బులను వడ్డీకి ఇచ్చేవాడు. ఈ క్రమంలో ప్రజలను నమ్మించి, సమయం చూసి కోటిన్నర రూపాయలతో గుట్టుచప్పుడు కాకుండా కుటుంబ సభ్యులతో పరారయ్యాడు. విషయం తెలిసిన బాధితులు మోసపోయామని గ్రహించి నిర్వాహకుని ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సంఘటనపై టూటౌన్ సిఐ మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం కటకం సైదిరెడ్డి అనే వ్యక్తి చిట్టీల సొమ్ముతో పరారీ అయినట్లు ఫిర్యాదులు అందగా, ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు 45 మంది బాధితుల వద్ద నుండి ఒక కోటి 54 లక్షల రూపాయలతో పరారైనట్టు తెలుస్తోందని అన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. నిందితుడు సైదిరెడ్డి కోసం రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేపడుతున్నామని తెలిపారు. త్వరలోనే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.