ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ మండుతోంది. మెయితీ తెగకు చెందిన అరంబాయ్ తెంగోల్ వర్గం కీలక నేత కానన్ సింగ్తో పాటుగా మరి కొందరిని శనివారంనాడు అరెస్టు చేయడంతో మరోసారి ఘర్షణలు మొదలయ్యాయి. కానన్ సింగ్కు మెయితీలలో గట్టి పట్టు ఉంది. అయితే మణిపూర్ హింసాకాండలో పాత్ర ఉందన్న ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. కానన్ సింగ్ను అరెస్టు చేసినందుకు నిరసనగా ఆందోళనకారులు ఆదివారం రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. నిషేధాజ్ఞలను సైతం లెక్కచేయకుండా ఆందోళనలు చేశారు. తమ నాయకుడిని విడుదల చేయాలంటూ కొందరు వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటామని బెదిరించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. కొన్ని చోట్ల కర్ఫూను సైతం విధించారు.
మరోవైపు మణిపూర్లో తాజా హింసాకాండపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో రెండు రోజులుగా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్రం పిలుపు మేరకు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అమిత్షాతో చర్చలు జరపడం కోసం సోమవారం ఢిల్లీకి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అయితే మణిపూర్ అల్లర్లు ఇప్పటికిప్పుడు మొదలైనవి కావు. గత రెండేళ్లుగా అక్కడ కుకీ గిరిజనులు, మైదాన ప్రాంతానికి చెందిన మెజారిటీ మెయితీల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అల్లర్లలో 260 మందికిపైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలా మంది ఇప్పటికీ శరణార్థి శిబిరాల్లోనే తలదాచుకుని ఉన్నారు. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం సొంతపార్టీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా పరిస్థితులు కొలిక్కి రాలేదు.
కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను గవర్నర్గా నియమించడంతో రాష్ట్రంలో శాంతి నెలకొంటుందని అందరూ భావించారు. గత ఫిబ్రవరిలో రాష్ట్రపతిపాలన అమలులోకి వచ్చాక రాష్ట్రం కాస్త శాంతించినట్లు కనిపించినా ఇప్పుడు మళ్లీ హింసాకాండ మొదలైంది. మైదాన ప్రాంతాలకు చెందిన మెజారిటీ మెయితీ తెగ తమకు కూడా గిరిజన హోదా కల్పించాలని గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తూ వస్తున్నారు. దీన్ని కొండ ప్రాంతాలకు చెందిన కుకీ తెగ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మెయితీలకు గిరిజన (Tribal Meiti) హోదా కల్పించినట్లయితే తమ ప్రాంతాలపై వారి ఆధిపత్యం మొదలవుతుందని, తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనేది వారి భయం. అయితే మెయితీలకు గిరిజన హోదా కల్పించాలని రాష్ట్రప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ 2023 మేలో మణిపూర్ హైకోర్టు తీర్పునివ్వడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
దీంతో ఒక్కసారిగా రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. మెయితీ తెగకు చెందిన గ్రామాలపై కుకీలు దాడి చేయడం, కుకీలకు చెందిన మహిళలను మెయితీ వర్గం ప్రజలు చెరబట్టడం, పలువురు హత్యకు గురికావడంతో మణిపూర్ అంతటా ఉద్రిక్తత నెలకొంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తమ పార్టీకే చెందిన బీరెన్ సింగ్ ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పరోక్షంగా ఆయనకు మద్దతుగా నిలిచింది. విపక్షాలన్నీ బీరెన్ సర్కార్ను తప్పించాలని డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా మణిపూర్లో పర్యటించి అక్కడి ప్రజలకు భరోసా కల్పించలేదు. పైగా ప్రతిపక్షాలకు చెందిన నేతలు మణిపూర్లో పర్యటించడానికి యత్నిస్తే అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నించారు. అయితే రానురాను పరిస్థితి చేయిదాటి పోతోందని భావించిన కేంద్రం చివరికి బీరెన్ సింగ్ను పదవినుంచి తప్పించినప్పటికీ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయకుండా సుప్త చేతనావస్థలోనే ఉంచింది.
అంటే రాష్ట్రంలో మామూలు పరిస్థితులు ఏర్పడితే మళ్లీ బిజెపి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలన్నది కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇటీవల మణిపూర్కు చెందిన పలువురు బిజెపి ఎంఎల్ఎలు ఢిల్లీలో అమిత్ షాను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడమే దీనికి నిదర్శనం. మణిపూర్ ఉద్రిక్తతలను కేంద్రం ఇప్పటికీ శాంతిభద్రతల సమస్యగానే చూస్తుండడం విచారకరం. రాష్ట్రంలో రెండు బలమైన తెగల మధ్య కొనసాగుతున్న హింసాకాండకు శాశ్వతంగా ముగింపు పలికే దిశగా చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పని చేసిన భల్లాకు రాష్ట్రంలోని పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉంది.
కేంద్రం కూడా రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే బాధ్యతను పూర్తిగా ఆయనకు అప్పజెప్పింది. అయితే గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు గడిచినప్పటికీ భల్లా ఇరువర్గాలతో శాంతి చర్చలకు ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యకరం.మరోవైపు గత రెండేళ్ల కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని మణిపూర్లో ఒక్కసారి కూడా పర్యటించకపోవడంపై రాజకీయ పార్టీలేకాక మేధా వివర్గాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశానికి ప్రధానిగా అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన మోడీ సరిహద్దు రాష్ట్రమైన మణిపూర్ను మాత్రం ఎందుకు నిర్లక్షం చేస్తున్నారనేది ఎవరికీ అంతుబట్టని విషయంగా మారింది. చిన్న రాష్ట్రమైనా సరిహద్దు రాష్ట్రంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
పైగా సుదీర్ఘ కాలం శాంతిభద్రతల సమస్య కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రజలు సైతం అభద్రతా భావంతోనే రోజులు వెళ్లదీస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా చాలా సున్నితమైనవని అందరికీ తెలిసిందే. ఈ దృష్టానైనా మణిపూర్ జాతుల సమస్యకు వీలైనంత త్వరలో ఓ శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడం అత్యవసరం. ప్రపంచ స్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రధాని మోడీకి ఈ సమస్యను పరిష్కరించడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకు కావలసింది సంకల్పమే. అది జరగనంత కాలం మణిపూర్ రావణకాష్ఠం లాగా రగులుతూనే ఉంటుంది.