ఒడిశా లోని సుందర్గఢ్ జిల్లాలో ఒక ట్రక్కు నుంచి సుమారు నాలుగు టన్నుల పేలుడు పదార్థాలను సాయుధ మావోయిస్టులు దోచుకొన్న సంఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బృందం గురువారం దర్యాప్తు ప్రారంభించింది. సుందర్గఢ్ జిల్లా లోని బంకో రాతిక్వారీ వద్దకు మంగళవారం 200 ప్యాకెట్ల జిలాటిన్ పేలుడు పదార్ధం రవాణా అవుతుండగా మావోయిస్టులు అడ్డుకుని వాటిని దోపిడీ చేశారు. ఝార్ఖండ్ లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లా లోని సరండ అటవీ ప్రాంతానికి అతి చేరువగా ఉన్న ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇది మావోయిస్టుల ప్రాంతం. మావోయిస్టులు తుపాకీ చూపించి డ్రైవర్ను బెదిరించి సమీపాన ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకుపోయారు.
అక్కడ నాలుగు టన్నుల పేలుడు పదార్ధాలను దోపిడీ చేశారు. గాలింపు చర్యల్లో ట్రక్కు దొరికినప్పటికీ, అందులో పేలుడు పదార్థాలు మాత్రం లేవు. హిందీ మాట్లాడే మావోయిస్టులు తనపై జాలితో విడిచిపెట్టారని డ్రైవర్ చెప్పాడు. ఎన్ఐఎకు చెందిన సీనియర్ అధికారులు డిఐజి, ఎస్పి, అడిషనల్ ఎస్పి, రూర్కెలాను సందర్శించారు. వీరికి ఒడిశా పోలీసులు సహాయం అందించారు. పొరుగున ఉన్న ఝార్ఖండ్ నుంచి సుందర్గఢ్ లోకి మావోయిస్టులు ప్రవేశించి ఉంటారని డిఐజి బ్రిజేష్ రాయ్ చెప్పారు.