హైదరాబాద్: కేబినేట్ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ తెలిపారు. సాంకేతిక కమిటీ, కేబినెట్ కమిటీ సిఫార్సు మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ ను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారించింది. విచారణ ముగిసిన అనంతరం రాజేందర్ మీడియాతో మాట్లాడారు. సిడబ్ల్యుసి, మహారాష్ట్ర అభ్యంతరాల దృష్టా ప్రాజెక్టు లొకేషన్ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు చేశామన్నారు. నిధుల కొరత దృష్టా కాళేశ్వరం కార్పేరేషన్ ఏర్పాటు చేశామని, ప్రారిశ్రామిక, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని డిపిఆర్లో ఉందని స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా? అని ఈటెలను కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణ అంశాలన్నీ నీటిపారుదల శాఖ కిందకే వస్తాయని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆర్ధిక మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ను ఇవాళ కమిషన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈనెల 9వ తేదీ సోమవారం రోజున నీటిపారుదల శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు కమిషన్ ముందుకు రానున్నారు. ఈనెల 11వ తేదీ బుధవారం రోజున మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కూడా కమిషన్ విచారించనున్నది.