దంపతుల దూకుడుపై ఎమ్మెల్యేల ఫిర్యాదు
విచారణ జరిపిస్తానని మీనాక్షి హామీ
సమస్యపై మీనాక్షితో -మల్లు రవి భేటీ
24న క్రమశిక్షణా సంఘం సమావేశం
మన తెలంగాణ/ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య నెలకొన్న పంచాయితీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ చెంతకు చేరింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొం డా సురేఖ దంపతులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా కలత చెందిన ఐదుగురు ఎమ్మెల్యే లు, ఒక ఎమ్మెల్సీ, వుడా చైర్మన్ తదితరులు ఆదివారం మీనాక్షి నటరాజన్ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మీ నాక్షి తాను పరిస్థితులను చక్కదిద్దే వరకూ మీరెవ్వరూ తొందరపడరాదని వారికి నచ్చజెప్పారు. తొలుత విచారణ కమిటీని నియమిం చి నివేదిక తెప్పించుకుంటానని ఆమె వారికి భరోసా ఇచ్చారు. అ నంతరం పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్, ఎంపీ మల్లు రవితో ఆమె తాజాగా నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు గాంధీ భవన్లో క్రమశిక్షణా సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆమె రవికి సూచించారు.
అసలేం జరిగింది..
మంత్రి సురేఖ భర్త కొండా మురళి ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి తదితరులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అధిష్టానం అనుమతి లేకుండానే వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తమ కుమార్తె పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ కూడా కడియం శ్రీహరినుద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో కలత చెందిన కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కెఆర్ నాగరాజ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రభృతులు తాజాగా సమావేశమై, ఈ సమస్యను అంత తేలిగ్గా వదలరాదని, తాడో-పేడో తేల్చుకుందామని నిర్ణయించుకున్నారు. ఇదిలాఉండగా ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, డిసిసి ప్రెసిడెంట్, కుడా చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి కలిసి మీనాక్షి నివాసానికి చేరుకుని కొండా దంపతులు చేస్తున్న వ్యాఖ్యలు, జిల్లాలో కలిగిస్తున్న ఇబ్బందుల గురించి వివరించారు.
అక్రమ దందాలు, బ్లాక్మెయిలింగ్ గురించి చెబుతూ తాము చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందో లేదో విచారణ జరిపించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారు ఆమెను కోరారు. అందుకు ఆమె ప్రతిస్పందిస్తూ ఈ మొత్తం వ్యవహారంపై తాను విచారణ కమిటీని నియమించి నివేదిక తెప్పించుకుని తగు చర్యలు తీసుకుంటానని ఆమె వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళిన అనంతరం ఆమె మల్లు రవితో సమావేశమై ఎందుకు ఇలా జరుగుతున్నదని అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. పార్టీ వ్యవహారాలు సాఫీగా జరుగుతున్నాయని అనుకుంటున్న సమయంలో చిరాకైన సమస్య ఎదురైందని ఆమె బాధను వ్యక్తం చేశారు. ఈ నెల 24న గాంధీ భవన్లో పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని సమావేశపరచాల్సిందిగా ఆమె సూచించారు. వరంగల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న సమస్యలన్నింటిపైనా చర్చించి సర్దుబాటు చేయడమో, చర్యలు తీసుకోవడమో చేయాలని వారు భావించినట్లు సమాచారం.