పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఏ క్షణమైన దాడి చేయొచ్చని పాక్ లో ఆందోళన నెలకొంది. దీంతో ఇప్పటికే రెండు క్షిపణులను ప్రయోగించిన పాక్.. బెదిరింపులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో మోడీ సర్కార్.. దేశంలో డిఫెన్స్ మాక్ డ్రిల్ చేపట్టేందుకు సిద్ధమైంది. రేపు(మే 7వ తేదీ బుధవారం) దేశవ్యాప్తంగా 259 ప్రదేశాలల్లో యుద్ధ సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
కశ్మీర్, గుజరాత్, హరియాణా, అస్సాం రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నంలోనూ డ్రిల్స్ జరగనున్నాయి. ప్రధానంగా వైమానిక దాడుల సైరన్లు, బ్లాక్అవుట్లు వంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు ఎలా స్పందించాలనే దానిపై శిక్షణ ఇవ్వనున్నారు.ఈ మాక్ డ్రిల్లో ప్రజలు, బిజెపి నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిస్తూ ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. కాగా, 1971 తర్వాత దేశంలో తొలిసారి ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు.