మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనగా ఆయన దిష్టి బొమ్మకు పాడె కట్టి నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి అధ్వర్యంలో ఆదివారం రాజేంద్ర నాగర్ నియోజకవర్గంలోని శంషాబాద్లో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మకు పాడె కట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండడాన్ని చూసి తట్టుకోలేని పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. పాడి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
సారు, కారు, పరారు… కాంగ్రెస్ నేత సాయి ధ్వజం
బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని కాంగ్రెస్ నాయకుడు, ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్కు ఇదే తమ చివరి హెచ్చరిక అని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. పాడికి ఇది స్వీట్ వార్నింగ్ కాదు డెడ్లీ వార్నింగ్ అని ఆయన తెలిపారు. బిఆర్ఎస్లో చెంచాలు చాలా ఉన్నాయని, అందులో పాడి చెంచా చప్పుడు ఎక్కువ వస్తున్నదని ఆయన అన్నారు. సారు కారు కాదు పదహారు అని లోక్సభ ఎన్నికల ముందు అన్నారని, ఇప్పుడు సారు కారు పరార్ అయ్యారని ఆయన ధ్వజమెత్తారు. చెంచా కౌశిక్ కథలు ఎక్కువ అయ్యాయని, తగ్గించుకోకపోతే ఇరిచేస్తామని ఆయన హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడాలని ఆయన అన్నారు.