భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో MG మోటార్స్ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ తన పాపులర్ ఎలక్ట్రిక్ SUV MG విండ్సర్ ప్రో టాప్ వేరియంట్ ఎసెన్స్ ప్రో ధరను రూ. 21,000 పెంచింది. ఇప్పుడు తాజా ధర ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ వాహనం రూ. 18.31 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లభిస్తోంది. అయితే, బేస్ వేరియంట్ ధర మాత్రం రూ. 14 లక్షల వద్ద యథాతథంగా ఉంది.
ఈ వాహనంలో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డ్యూయల్ టోన్ ఇంటీరియర్, V2L , V2V, యాంబియంట్ లైటింగ్, ఇన్ఫినిటీ గ్లాస్ రూఫ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, 15.6 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 4 స్పీకర్లు, 4 ట్వీటర్లు, సబ్ వూఫర్, డిజిటల్ క్లస్టర్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, 604 లీటర్ల బూట్ స్పేస్, LED హెడ్-టెయిల్ లైట్లు, పవర్డ్ టెయిల్గేట్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
MG విండ్సర్ ఎసెన్స్ ప్రో EV 52.9 kWh బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. 60 kW ఫాస్ట్ ఛార్జర్తో 50 నిమిషాల్లో 20% నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇందులోని మోటార్ 136 PS పవర్, 200 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం హ్యుందాయ్ క్రెటా EV, టాటా కర్వ్ EV, టాటా నెక్సాన్ EV, మహీంద్రా BE6 వంటి కార్లతో గట్టిగా పోటీ పడుతోంది.