అధికారులపై దాడులు చేస్తే ఊరుకోం
భద్రాచలం ఈఓ రమాదేవిపై జరిగిన దాడిని ఖండించిన మంత్రి కొండా
పురుషోత్తపట్నంలో భద్రాచలం రాముడి భూముల కబ్జాపై
ఎపి సిఎం చొరవ తీసుకోవాలని మంత్రి కొండా విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: దేవుడి భూములు రక్షించే దేవాదాయ శాఖ అధికారులపై దాడులు చేస్తే ఊరుకోమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మంగళవారం భద్రాచలం ఈఓ రమాదేవిపై జరిగిన దాడిని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా దేవాదాయ శాఖ భూములను కబ్జా చేస్తే పిడి యాక్టు పెడతామని మంత్రి కొండా హెచ్చరించారు. భద్రాచలానికి సంబంధించి రామాలయ భూములు పురుషోత్తపట్నం (ఎపి)లో కబ్జాకు గురవుతుండడాన్ని అడ్డుకున్న ఈ రమాదేవిపై దాడి చేయడం సహేతుకం కాదని మంత్రి సురేఖ హితవు పలికారు. ఈ విషయంలో ఎపి ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.
పురుషోత్తపట్నంలో 889.5 ఎకరాల భూమి
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి పురుషోత్తపట్నంలో భూములున్నాయి. ఆ భూమిలో అనుమతి లేకుండా స్థానికులు భవన నిర్మాణ పనులు చేపడుతుండటంతో భద్రాచలం టెంపుల్ సిబ్బంది దానిని అడ్డుకునే క్రమంలో ఆ గ్రామస్థులతో తరచూ ఘర్షణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భద్రాద్రి రాముడికి సుమారు 1,300 ఎకరాల భూమి ఉండగా అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోనే గరిష్టంగా 889.5 ఎకరాల భూమి ఉంది. పురుషోత్తపట్నంలోని భూమి ఎక్కువ భాగం ఆక్రమణకు గురైంది. అక్కడి కోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిపై దేవస్థానానికి హక్కులు లభించాయి. వీటిని పురుషోత్తపట్నం వాసులు పరిగణనలోకి తీసుకోవటం లేదు.
పురుషోత్తపట్నంలోకి ప్రవేశించే మార్గంలో పిల్లర్లతో నిర్మాణ పనులు చేపడుతున్నారన్న సమాచారం అందుకున్న ఆలయ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేయవద్దని, ఇది పూర్తిగా రాముడి భూమి అని స్థానికులతో భద్రాచలం ఆలయం ఈఓ రమాదేవి వివరించారు. కోర్టు తీర్పులతో దేవుడి పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయని ఈఓ వారితో పేర్కొన్నారు. అయితే, ఈఓ అభ్యంతరాలు వినకుండా స్థానికులు ఈఓపై దాడి చేశారు. దీంతో ఆమె సృహా కోల్పోవడంతో ఆమెను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.