ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మండల పరిధిలోని పందిల్ల గ్రామంలో వెంకట్ రెడ్డి అనే రైతు పొలంలో ఎడ్లతో నాగలి పట్టి.. దుక్కి దున్ని రైతులకు ఉత్సాహం కలిగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఏరువాక పౌర్ణమి రైతులు విత్తనాల సాగుకు మంచి రోజని అన్నారు. రైతులు వరి తోపాటు మొక్కజొన్న, ఆయిల్ పామ్ తదితర పంటలు సాగు చేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రైతులకు ఉచిత విద్యుత్.. సాగునీరు.. పెట్టుబడి సహాయం.. మద్దతు ధర అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రైతులకు విత్తనాలు అందిస్తాం.. ఒక్క గుంట కూడా బీడు భూమి లేకుండా సాగు చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించారు.
సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి.. పాడి, పంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందుకు రైతుల శ్రమ, పకృతి సహకారం అవసరం అన్నారు.ఇటీవల స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు మహోత్సవం కార్యక్రమం ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతలు, పనిముట్ల వినియోగంపై అవగాహన కల్పించామని అన్నారు. రసాయన ఎరువులు, యూరియా వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులు వినియోగిస్తూ రైతులు అధిక దిగుబడులు పొంది తద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో ఛైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఆర్డిఒ రామ్మూర్తి, ఏడిఏ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి శ్రేయ, ఎఎంసి ఛైర్మన్ కంది తిరుపతిరెడ్డి, వైస్ ఛైర్మన్ బంక చందు, మడప యాదవ రెడ్డి, బిఖ్య నాయక్, చిత్తారి పద్మ రవీందర్, భూక్య సరోజన, వల్లపు రాజు, పున్న లావణ్య సది, ఎండి హసన్, కోమటి సత్యనారాయణ, మడప జైపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.