ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఎన్టీఆర్ నగర్లోని ఖిల్లా మైసమ్మ అమ్మవారికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రికి ప్రత్యేక సన్మానం చేశారు. మంత్రి వెంట గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకా మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి, బడంగ్ పేట మేయర్ పారిజాత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 300 సంవత్సరాల క్రితం వెలసిన ఖిల్లా మైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఎన్నో మహిమలున్న ఖిలా మైసమ్మ బోనాలను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఖిలా మైసమ్మ తల్లి దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ప్రజలు సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లే విధంగా దీవించాలని ఖిలా మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నానని వివరించారు. అమ్మ దీవెనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.