Saturday, June 28, 2025

మావోయిస్టుల లేఖపై స్పందించిన మంత్రి సీతక్క

- Advertisement -
- Advertisement -

మావోయిస్టులు తనను ఉద్దేశించి విడుదల చేసిన లేఖపై సిఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. శుక్రవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ఏటునాగారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..మావోయిస్టులు ప్రజా ప్రభుత్వంపై ఇటీవల విడుదల చేసిన లేఖలో అధికార కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న తాను మహిళ అని చూడకుండా అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని అన్నారు. తాను నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, వారంలో రెండు నుంచి మూడు రోజులు ములుగు, ఆదిలాబాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ నిత్యం ప్రజలతో మమేకమై ఉంటున్నానని అన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలలో తనను ఓడించడానికి ఒక కోయ మహిళకు జనరల్ పోర్ట్‌పోలియో దక్కడాన్ని బిఆర్‌ఎస్ పార్టీ జీర్ణించుకోలేక విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ప్రభుత్వ జిఒ 49 తో అడవి బిడ్డలు నష్టపోతున్నారని, ఆ జిఒను తాను కూడా వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు. ఆదివాసీలు, అణగారిన వర్గాల కోసం విపక్షంలో ఉన్నప్పుడు కూడా నిత్యం పోరాటాలు చేస్తూ వచ్చానని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఆదివాసీలకు మేలుచేసేలా తన అధికారాన్ని వినియోగిస్తున్నానని అన్నారు. ‘కొత్త పోడు కొట్టద్దు, పాతపోడు వదలొద్దు’ అనే నినాదంతో పోడు రైతులకు లాభం చేకూర్చే విధంగా కృషి చేస్తున్నానని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోడు సమస్యపై స్పందించని బిఆర్‌ఎస్ నేతలు పోడు రైతులపై కపట ప్రేమ చూపించడంపై మండిపడ్డారు.

మావోయిస్టుల లేఖను అడ్డం పెట్టుకొని తనను ఒక గిరిజన మహిళ అని చూడకుండా అవమానిస్తూ గులాబీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఆదివాసీలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ నిత్యం పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ , జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవిచందర్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News