తొలి బడి అమ్మ ఒడి .. మలి బడి అంగన్వాడీ బడి అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా మంత్రి పాత కొత్తగూడెం నుంచి పెనుబల్లి రోడ్డు 0/600 వద్ద 6.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ అమృతం పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎసే వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి పరిశీలించి వేస్ట్ నుంచి బెస్ట్ రూపొందించిన కళాకృతులను చూసి అభినందించారు.ఆడపిల్లలకు శక్తినిద్దాం… ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన
ఇందిరమ్మ అమృతం పథకాన్ని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిత రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఐటీడీఏ పీవో రాహుల్తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… కౌమార బాలికల్లో రక్తహీనత నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పేరుతో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం ఆసీఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా మూడు జిల్లాలో 50,269 మంది బాలికలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
అంగన్వాడీ కేంద్రాలన్నీంటిని ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చడం జరిగిందని, పిల్లలందరికీ నర్సరీ పాటలతో పాటు ఆహారం అందించడం జరుగుతుందన్నారు.ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి తల్లిదండ్రుల కష్టాలు వృదా చేయకుండా అంగన్వాడీ కేంద్రాలు, కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు ఆడుకోవడానికి 57 రకాల ఆట వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు. త్వరలోనే గర్బిణులు కింద కూర్చోకుండా అన్ని కేంద్రాల్లో బల్లలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పథకం కింద మంజూరైన రూ.74.64 లక్షల చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నాగలక్ష్మీ, సీపీవో సంజీవరావు, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.