సెమీకండక్టర్ల తయారీ,
డిజైనింగ్లో యువతకు శిక్షణ
2030నాటికి 10వేల మందికి
శిక్షణ ఇచ్చేందుకు స్ప్రింగ్
సెమీ కండక్టర్స్ అంగీకారం
ఐటి, పరిశ్రమల మంత్రి
శ్రీధర్బాబు వెల్లడి
మన తెలంగాణ / హైదరాబాద్ : ‘స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ’ గా తెలంగాణను మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో కృషితో చేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న యూకేకు చెందిన సెమీ కండక్టర్ దిగ్గజ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులతో ఆయన బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు, పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాకాలను ఈ సందర్భంగా వివరించారు.
సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. 10వేల మంది యువత శిక్షణనిచ్చే బాధ్యతను తీసుకోవాలని సమావేశానికి హాజరైన మలేషియాకు చెందిన దిగ్గజ సంస్థ స్ప్రింగ్ సెమీ కండక్టర్స్ సీఈవో కెన్ కూను కోరారు.తమవంతుగా ఇక్కడి యువతను సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్ లో అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చి దిద్దేలా ప్రత్యేక కరిక్యులమ్ ను రూపొందిస్తామని కెన్కూ తెలిపారు. విద్యా సంస్థల సహకారంతో ఆరు నెలలపాటు ఇక్కడ శిక్షణ, మిగిలిన కాలం తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల్లో ఇంటర్న్ షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. టీ కన్సల్ట్ సహకారంతో 2030 నాటికి 10వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని కెన్ కూ మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు.