Sunday, June 8, 2025

కాళేశ్వరానికి, సబ్ కమిటీకి సంబంధమే లేదు

- Advertisement -
- Advertisement -

ప్రాజెక్టును కేబినెట్ ఆమోదించనేలేదు
పెండింగ్ ప్రాజెక్టులపైనే అప్పటి
ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం
ఏర్పాటు చేసింది అనవసరంగా
నన్ను వివాదాల్లోకి లాగుతున్నారు
కమిషన్‌కు సుమోటోగా వాస్తవాలు
వివరిస్తా : మంత్రి తుమ్మల

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు కు అప్పటి మంత్రివర్గం ఆమోదం లేదని మంత్రి తు మ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీ నికి మంత్రివర్గం ఆమోదం ఉన్నట్టు అప్పటి ఆర్థికశా ఖ మంత్రి, ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వ రం కమిషన్‌కు చెప్పిన మాట పచ్చి అబద్ధమని తు మ్మల ఖండించారు. దీంతో ఈ అంశం రాజకీయవర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘కాళేశ్వరం ప్రా జెక్టు మంజూరు అంశం ఎప్పుడూ కేబినెట్ ముందు కు రాలేదు… క్యాబినెట్ అప్రూవల్ లభించలేదు..కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి తాము సబ్ కమిటీ గా ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వలేదు..కాళేశ్వరం డైరెక్ట్‌గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో కార్యరూపం దాల్సింది. మూడేళ్ళ తర్వాత  కేవలం సవరించిన అంచనాలు మాత్రమే క్యాబినెట్‌కు ముందుకు వచ్చాయి’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం సచివాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు తన పేరును ప్రస్తావించడంతో స్పందించినట్లు ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ఇచ్చిందని, కేబినెట్ ఆమోదించిందంటూ ఈటల రాజేందర్ అబద్ధాలు మాట్లాడారని మంత్రి తుమ్మల తెలిపారు. ముందు మేడిగడ్డ మంజూరు జీవో వచ్చిందని, అది 2016 మార్చి ఒకటో తేదీన జీవో(నెం.231), ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత రీ ఇంజినీరింగ్ జీవో వచ్చిందని మంత్రి వివరించారు. అది 2016 మార్చి 15న సబ్ కమిటీ జీవో (నెం.655) అని, తాను అందులో సభ్యుడిగా ఉన్నానని, అయితే కేబినెట్ సబ్ కమిటీకి, మేడిగడ్డ మంజూరుకు సంబంధం లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల స్థితిగతుల మీదనే కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటైందని, తనకు అబద్దం ఆడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మధ్యలో మిగిలిపోయిన నాలుగు ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసుకోవడానికి, వాటి స్థితిగతులు, ఆ ఇంజినీరింగ్ వర్క్ ఏరకంగా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించి మంత్రివర్గ ఉపసంఘం రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. ఆ రిపోర్టు తనవద్ద ఉందని, అందులో కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలు ఏవీ లేవని మంత్రి తుమ్మల వివరించారు.

కాళేశ్వరానికి లెంకపెట్టడం తగదు :
ప్రాణహిత, దేవాదుల, కాంతనపల్లి, తుపాకుల గూడెం, సమ్మక్క సారక్క ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ వేసి వాటిల్లో మిగిలిపోయిన పనులు ఏవిధంగా చేస్తే బాగుంటుందని ఆ శాఖతో సంప్రదించి తాము రిపోర్టు ఇచ్చామన్నారు. దానికి, కాళేశ్వరానికి లంకెపెట్టి ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు కూడా సంతకం పెట్టారని ఈటల రాజేందర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయాలు వేరు…రాష్ట్ర అభివృద్ధి వేరు అనే విషయాన్ని బిజెపి పార్టీ పెద్దలు గుర్తించాలని ఆయన హితవు పలికారు. తనకు ఉన్న చిన్నపాటి పరిజ్ఞానానికి రాష్ట్ర అభివృద్ధి కోసం సూచనలు చేశానని, అయితే జరగనిది జరిగినట్లుగా చెప్పి కాళేశ్వరం కమిషన్‌ను, ప్రజలను తప్పుదోవ పట్టించడం ఈటెల రాజేందర్‌కే చెల్లిందని దుయ్యబట్టారు.

కమిషన్ రిపోర్టు తర్వాత వివరాలు వెల్లడిస్తా :
కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చాక తన వద్ద ఉన్న రికార్డులను వెల్లడిస్తానని మంత్రి తుమ్మల చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ రెఫరెన్స్, తాము ఇచ్చిన రిపోర్టు, ఇంకా అవసరమనుకుంటే తేదీలతో సహా, జీవోలతో సహా ఆనాటి ఆర్థిక శాఖ కార్యదర్శి ఏమి రాశారనే వివరాలు వెల్లడిస్తానని ఆయన వివరించారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ చెప్పినట్లు కాళేశ్వరం పై మంత్రివర్గ ఉపసంఘం అనేది సత్యదూరమని మరో మారు స్పష్టం చేశారు. దీనిపై క్షుణ్ణంగా ఆర్డర్లతో సహా, జీవోలతో సహా ఎవ్వరితోనైనా చర్చించేందుకు తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.

సుమోటోగా కమిషన్‌కు నివేదిస్తా :
అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎలాంటి విధానాలు పాటించాలన్నదే క్యాబినేట్ సబ్ కమిటీ విధి అని, క్యాబినెట్ సబ్ కమిటీ రికమండేషన్లను తానే సుమోటోగా కాళేశ్వరం కమిషన్ కు పంపించనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. జరిగిన విషయాలపై కాళేశ్వరం కమిషన్‌కు నాటి జీవోలు, పూర్తి సమాచారంతో తానే లెటర్ రాస్తానని చెప్పారు. సబ్ కమిటీకి, కాళేశ్వరానికి సంబంధం లేదని, కాళేశ్వరం క్యాబినెట్ కు రాలేదని, రాజేందర్ కమిషన్ ముందు అబద్దం చెప్పారు కాబట్టి ఆయనకు అది తగదు అని చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు.

మాటలతో మభ్యపెట్టజాలరు :
ఈటల రాజేందర్ పొంతనలేని ప్రకటనలు ఇచ్చి ఇంకా ప్రజలను మభ్యపెట్టడం, రైతాంగానికి నష్టం చేసే కార్యక్రమాలను కొనసాగించడం విచారకరమని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. కేవలం ఏడాదిన్నర కాలంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయంగా బురద జల్లడానికి ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇవి ఏవీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినవి కావని, ‘శాంక్షన్స్ మీరే ఇచ్చారు…అప్పటికి క్యాబినేట్ అప్రూవల్ లేదు… ఎస్టిమేషన్ రివైజ్డ్ మీరే చేశారు…ఆ పథకం కూడా నిరుపయోగం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ( ఎన్‌డిఎస్‌ఏ) ఆనాడే చెప్పింది..’ అని తుమ్మల వివరించారు.

వాస్తవాలు కమిషన్ నిర్థారిస్తుంది :
గత ఐదేళ్ళ ప్రభుత్వంలో తాను లేనని, ఆనాడు జరిగిన నిత్య సత్యాలను ఏమార్చి ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఎవ్వరికీ సాధ్యం కాదని, వాస్తవాలు ఏమిటో కమిషన్ నిర్ధారణ చేస్తుందన్నారు. కమిషన్ ఇచ్చే రిపోర్టు ప్రకారంగా ఆయా సంస్థలు చర్యలు తీసుకుంటాయని మంత్రి తుమ్మల తెలిపారు. ఇలాంటి తప్పుడు మాటలతో ఈటల రాజేందర్ ఇంకా ఎంతో కాలం ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు.

ఆధారాలు ఇవ్వమనండి :
కాళేశ్వరం అంశం కేబినెట్‌కు వచ్చినట్లుగా అప్రూవల్ ఉంటే ఈటల రాజేందర్ ను వాటిని ఇవ్వమనండి…ఆయన రాసినట్లుగా ఆ ఫైళ్లలో ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి తుమ్మల తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలోకి తాను వెళ్లదలచుకోలేదని, తాను ఉన్న కేబియెట్ సబ్ కమిటీకి సంబంధించి రాజేందర్ ఇచ్చిన ప్రకటనలో వాస్తవం లేదని చెప్పడమే తన ఉద్దేశ్యం అన్నారు. కమిషన్ ఈటల రాజేందర్‌ను అడిగింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే ఆయన ఇతర ప్రాజెక్టుల గురించి సంబంధం లేని విషయాలను కమిషన్‌కు చెబుతున్నారని అన్నారు. క్యాబినెట్ సబ్ కమిటి రికమెండేషన్స్ ఉన్నాయని, ప్రతి ప్యాకేజికి సంబంధించినవి ఉన్నాయని, అవన్నీ కాళేశ్వరం కమిషన్‌కు పంపిస్తానని జరగని వాటిని జరిగినట్లుగా ఈటల రాజేందర్ కమిషన్ ఎదుట చెప్పారని అన్నారు. ఈటల రాజేందర్ అలా ఎలా మాట్లాడారనేది, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది తనకు అంతుబట్టడం లేదన్నారు. అదంతా అసంబద్దం, అవాస్తవం అని తుమ్మల ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News