హైదరాబాద్: గోదావరి-బనకచర్లపై (Banakacherla Project) ఎంపిలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశానికి సిఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపిలు, బిజెపి ఎంపిలు డికె అరుణ, రఘునందన్ రావు, బిఆర్ఎస్ ఎంపి రవిచంద్ర, ఎంఐఎం ఎంపి అసదుద్ధీన్ ఓవైసీ హాజరయ్యారు. గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని సిఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ నేతృత్వంలోని బృందం కలవనుంది.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. పోలవరం-బనకచర్ల (Banakacherla Project) విషయంలో ఎపి విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని అన్నారు. ఎపి రిపోర్టుపై స్పందించాలని కేంద్రం తమని అడిగిందని తెలిపారు. పూర్తిస్థాయి నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. తను, సిఎం ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర అభ్యంతరాలను తెలుపుతామని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు పెద్ద దెబ్బ అని తెలిపారు. ఈ ప్రాజెక్టును పరిశీలించడం అంటే రాష్ట్ర హక్కులను కాలరాయడమే అని అన్నారు.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును తిరస్కరించాలని కేంద్రానికి స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. గోదావరి ట్రైబ్యునల్ అవార్డును బనకచర్ల ప్రాజెక్టు ఉల్లంఘిస్తుందని.. తెలంగాణకు అనుకూలమైన ఇచ్చంపల్లిని ఎపి వ్యతిరేకించిదని మండిపడ్డారు. అత్యవసరంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. తెలంగాణ వాటా 968 టిఎంసిలలో కట్టుకొనే ప్రాజెక్టులను ఎపి వ్యతిరేకించిందని.. బనకచర్ల వల్ల మన వాటా జలాలకు కూడ భవిష్యత్తులో ఎదురుదెబ్బ తగులుతుందని అన్నారు. పూర్తయిన ప్రాజెక్టులకు అధిక కేటాయింపులను భవిష్యత్తులో ఎపి అడుగుతుందని పేర్కొన్నారు. దీనిపై కేంద్రానికి జనవరి 22న అభ్యంతరాలను చెప్పామన్నారు. అయితే ఎపి నుంచి డిపిఆర్ అందలేదని కేంద్రం సమాధానం ఇచ్చిందని తెలిపారు.