ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న దరిమిలా రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. సోమవారం నీటిపారుదల శాఖా ప్రధాన కార్యాలయం జలసౌధ లో జరిగిన నీటిపారుదల శాఖా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని రాష్ట్రం లోని ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. నీటిపారుదల శాఖా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఇఎన్సిలు అంజద్ హుస్సేన్ సిఈలు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలు పెట్టిం చేవెళ్ల-ప్రాణహితను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయల్సిన ప్రాజెక్టులలో సమ్మక్క- సారక్క ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.అందులో భాగంగా ఈ నెల 23 న ఢిల్లీ లో కేంద్ర జలవనరుల సంఘం సమావేశానికి హాజరై ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులతో పాటు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నుండి అనుమతి తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అదే విదంగా ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో చర్చించి అనుమతులు తీసుకోవాలని ఆయన సూచించారు. సీతారాం సాగర్, మోడికుంట వాగు, చనాకా/ కొరాట డిస్ట్రిబ్యూటరీ సిస్టంతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మణాలకు కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలన్నారు.
కృష్ణా జలాలపై 23-, 25 న వాదనలు : కృష్ణా జలాల వివిధ ట్రిబ్యునల్ విషయమై సుప్రీంకోర్టులో ఈ నెల 23-, 25 న వాదనలు ఉన్నందున అంతకు ముందే సుప్రీంకోర్టు న్యాయవాది సి.ఎస్ వైద్యనాధ్ తో చర్చలు జరగనున్నాయన్నారు. జాతీయ డ్యామ్ ల పరిరక్షణ సంస్థ చేసిన సూచనలకు అనుగుణంగా మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజ్ లను పునరుద్ధరణ ఉంటుందన్నారు.బ్యారేజ్ లను పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతతో ఉందని అయితే ఎన్ఆర్ఎస్ఎ సూచనాలకు అనుగుణంగా పనులు ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో ఐఐఐటి వంటి సంస్థలతో నిర్మాణానికి సంబంధించిన అంశాలను పరీక్షించేలా చర్యలు తీసుకోవడంతో పాటు వరదలు తగ్గిన వెంటనే పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు. వచ్చే సంవత్సరం వానాకాలం లోపు పనులు పూర్తి చేయాలన్నారు.
అన్నింటికీ మించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పూర్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్నభూసేకరణ, పునరావాసంతో పాటు అటవీ శాఖ అనుమతుల వంటి ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలన్నారు. కొడంగల్ -నారాయణపేట ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డిండి, ఎస్.ఎల్.బి.సి, పెండ్లి పాకల,న క్కలగండి ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలన్నారు. జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి అక్కడి ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. వచ్చే మంత్రివర్గ సమావేశానికి ముందే దేవాదుల ప్యాకేజ్ 3,6 పనుల పురోగతి పై నివేదిక సమర్పించాలని చెప్పారు.
పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేయండి : యావత్ భారత దేశంలో తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా చేపట్టిన రిజర్వాయర్ లలో పూడిక తీత పనులపై పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.ఇప్పటికే మిడ్ మానేరు,కడెం రిజర్వాయర్లలో మొదలు పెట్టామని ప్రస్తుతం జూరాల, నాగార్జున సాగర్, ఎస్.ఆర్.ఎస్.పి నిజాం సాగర్,హుస్సేన్ సాగర్ తదితర ప్రాజెక్టుల్లో పూడిక తీత పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఇప్పుడు చేపట్టిన పూడిక తీత పనుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 500 కోట్ల రాబడి ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినట్లయితే ప్రభుత్వానికి రూ. 3వేల కోట్ల నుండి 4వేల కోట్ల వరకు రాబడి వస్తుందన్నారు. అన్నింటికీ మించి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఎస్ ఎల్ బిసి పనుల పునరుద్దరణకు నిర్వహించ తలబెట్టిన హెలిబోర్న్ సర్వేకు రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎస్.ఎల్.బి.సి టన్నెల్ సమీపంలో హెలిబోర్న్ ఏరియల్ మాగ్నెటిక్ సర్వే ఏర్పాట్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నీటి పారుదల శాఖల్లో మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం పదోన్నతుల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని తెలిఇపారు. పదోన్నతులు పొందిన వారికి ఈ నెల 14 న జలసౌధ లో అభినంద సభ ఏర్పాటు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.