Thursday, June 5, 2025

బనకచర్లను ఒప్పుకోం

- Advertisement -
- Advertisement -

అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం
మా అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేశాం కేంద్ర మంత్రి
సి.ఆర్ పాటిల్‌కు ఫిర్యాదు చేశాం బనకచర్లను
అడ్డుకోవాలని కోరాం గోదావరి రివర్ మేనేజ్‌మెంట్
బోర్డుకు, కేంద్ర మంత్రికి లేఖలు రాశాం మీడియాతో
చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లే వాడుకుంటామని ఏపీ నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ బనకచర్లను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఆంధ్రప్రదేశ్ నేతలు పేర్కొనడం విస్మయం కలిగిస్తోందన్నారు. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్‌కు లేఖలు రాశామని, ఈ అంశంపై కేంద్ర మంత్రితో నేరుగా మాట్లాడి ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరినట్లు వివరించారు. తమ అభ్యంతరాలను కేంద్రానికి తెలియచేశామని, ఈ అంశంపై సరైన సమయంలో స్పందిస్తామని ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే ఇటువంటి ప్రాజెక్టుల విషయంలో ఏ మాత్రం రాజీపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక సమావేశం : కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పోలవరం-బనకచర్ల రివర్ లింక్ ప్రాజెక్ట్ డీపీఆర్ పై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రూ.81,000 కోట్లతో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఈ సమావేశంలో పోలవరం- బనకచర్ల రివర్ లింక్ ప్రాజెక్ట్ డీపీఆర్( డిటేయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్)పై చర్చించినట్లు సమాచారం. రూ.81 వేల కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడానికి ఏపీ ప్రయత్నం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాజెక్ట్‌తో కలిగి ప్రయోజనాలు వివరిస్తూ డీపీఆర్ రూపొందించారు. ఈ నేపథ్యంలో జూన్ 2న న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో ఏపీ జలవనరులు శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఏపీ ప్రభుత్వ నీటి సలహదారు వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి ఏపీ అధికారులు సోదాహరణగా వివరించారు. ఈ సందర్బంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తెలంగాణకు ఏమైనా నష్టం జరిగే అవకాశముందా అనే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఏపీ అధికారులను ప్రశ్నించగా వాటికి సైతం రాష్ట్ర అధికారులు స్పష్టమైన వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే బనకచర్ల ప్రాజెక్ట్‌ను తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరోవైపు సముద్రంలోకి వెళ్లే జలాలు మాత్రమే వినియోగించుకుని జనకచర్ల రూపొందించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇందులో తెలంగాణకు అభ్యంతరమేంటని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ప్రశ్నించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ కోరిన పూర్తి వివరాలను ఏపీ నీటి పారుదల, ఆర్థిక శాఖల అధికారులు సమర్పించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News