నేడే మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫైనల్
హైదరాబాద్ హైటెక్స్లో భారీ ఏర్పాట్లు
150 దేశాల్లో పోటీల లైవ్ టెలికాస్ట్
మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్మనీ
హాజరు కానున్న సిఎం రేవంత్, సినీ, రాజకీయ ప్రముఖులు
గ్రాండ్ ఫినాలేకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ నెల 31 శనివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ వేడుక హైటెక్స్లో నిర్వహించేందుకు అటు మిస్ వరల్డ్ నిర్వాహకులు, ఇటు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు విస్త్రత ఏర్పాట్లు చేశారు. ఈ చివరి ఘట్టాన్ని వీక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, సెలబ్రెటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఇందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరిగాయి. 72వ ప్రపంచ సుందరిగా ఎంపికైన విజేత తలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కిరీటం పెట్టనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 108 మంది వివిధ దేశాల పోటీదారులు అందం, ఉద్దేశం, ఐక్యతను జరుపుకునే ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడతారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొని తమ ప్రతిభను చాటటంతో పాటు, తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించిన సంగతి తెలిసిందే.
‘తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని’ ఈ వేడుక ద్వారా ప్రపంచవ్యాప్తం చేశారు. గ్రాండ్ ఫినాలేలో విజేతగా ఎంపికైన వారికి రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీని అందించనున్నారు.కాగా ఈ వేడుకకు మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్లుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రముఖ మానవతావాది, నటుడు సోనూ సూద్కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఆయన ఫైనల్స్ కు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తారు. ఇతర జ్యూరీలుగా సుధా రెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ఉన్నారు. మిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మనుషి చిల్లర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం భారతదేశంలో సోనీ లివ్లో లైవ్, మిస్ వరల్డ్ యూ ట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దాదాపు 150 దేశాల్లో జాతీయ టెలివిజన్లో ఈ కార్యక్రమం ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఫైనల్స్లో ఎంపిక విధానం
మిస్ వరల్డ్ 2025లో పాల్గొన్న 108 మంది పోటీదారుల నుండి, ప్రతి ఖండం అంటే అమెరికా, కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానియా నుండి 10 మంది సెమీ ఫైనలిస్టులు, మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్కు చేరతారు. – కొందరు పోటీదారులు ఫాస్ట్-ట్రాక్ ఛాలెంజ్ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికా, కరీబియన్ నుంచి హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ద్వారా అన్నాలిసే నాంటన్ (ట్రినిటాడ్, టొబాగో), టాప్ మోడల్ ద్వారా ఆరెలీ జోకిమ్ (మార్టినిక్), బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా వలెరియా పెరెజ్ (ప్యూర్టో రికో), మల్టీ మీడియా అవార్డు ద్వారా మైరా డెల్గాడో (డొమినికన్ రిపబ్లిక్) ఉన్నారు. ఆఫ్రికా హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ ద్వారా ఫైత్ బ్వాల్యా (జాంబియా), టాప్ మోడల్ ద్వారా సెల్మా కమన్య (నమీబియా), బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా నటాషా న్యోన్యోజి (ఉగాండా), మల్టీ మీడియా అవార్డు ద్వారా ప్రిన్సెస్ ఇస్సీ (కామెరూన్) ఉన్నారు.
ఇక యూరప్ నుంచి స్పోర్ట్ ఛాలెంజ్ ద్వారా ఎలిసే రండ్మా (ఎస్టోనియా), హెడ్ టు హెడ్ ఛాలెంజ్ తో పాటు బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా మిల్లీ మే ఆడమ్స్ (వేల్స్), టాప్ మోడల్ ద్వారా జాస్మిన్ గెర్హారడ్ట్ (ఐర్లాండ్), మల్టీ మీడియా అవార్డ్ ద్వారా ఆండ్రియా నికోలిచ్ (మాంటెనెగ్రో) ఉన్నారు. ఆసియా, ఓషియానియా నుంచి టాలెంట్ అండ్ బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా మోనికా కెజియా సెంబిరింగ్ (ఇండోనేషియా), హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ద్వారా ఇడిల్ బిల్గెన్ (టర్కీ), టాప్ మోడల్ ద్వారా నందిని గుప్తా (భారతదేశం), మల్టీ మీడియా అవార్డు ద్వారా ఓపల్ సుచాతా (థాయిలాండ్) ఉన్నారు. కాగా మిగిలిన సెమీ ఫైనలిస్టులు వ్యక్తిగత ఇంటర్వ్యూల తర్వాత జడ్జ్ల ప్యానెల్ ద్వారా ఎంపిక చేయబడతారు. ఫైనల్ షో సమయంలో ఈ వివరాలను వెల్లడిస్తారు. క్వార్టర్ ఫైనల్స్ నుండి, ప్రతి ఖండం నుండి టాప్ 5, ఆ తర్వాత టాప్ 2, చివరిగా నాలుగు ఖండ విజేతలు ఎంపికవుతారు. వారు చివరి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా కొత్త మిస్ వరల్డ్ విజేత ఎన్నికవుతుంది.
71వ మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా చేతుల మీదుగా విజేతకు కిరీటం అందజేత
ప్రస్తుత 71వ మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా కొత్తగా ఎన్నికయ్యే మిస్ వరల్డ్ విజేతకు కిరీటం అందజేస్తారు. మిస్ వరల్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన ఫెస్టివల్గా ప్రతీయేటా నిలుస్తోంది. కేవలం అందచందాలకే ప్రాముఖ్యత కాకుండా, ఈ కార్యక్రమం తెలివితేటలు, సామాజిక న్యాయం, సాంస్కృతిక మార్పిడి, ఉద్దేశ్యం, నాయకత్వ లక్షణాల ద్వారా మహిళలను సాధికారతను చేస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా 72 వ మిస్ వరల్ ఎంపిక కార్యక్రమం ఒక మరపురాని సాయంత్రంగా మిగిలిపోనుంది.