హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు సుమారు రూ.30 కోట్ల ఖర్చు అయిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీనిలో స్పాన్సర్ల ద్వారానే రూ.21 కోట్లు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వానికి అయిన ఖర్చు రూ.9 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. మరో 10 నుంచి 11 కోట్ల నిధులు మిగిలిన స్పాన్సర్ల నుంచి రావాల్సి ఉందని, ఇందుకు ఒప్పందాలు ఉన్నాయని అన్నారు. ఆ మొత్తం కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వాకి సున్నా ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా ప్రపంచం మొత్తాన్ని హైదరాబాద్ వచ్చేలా చేశామని వివరించారు. మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని అన్నారు. డా.బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి జూపల్లి మంగళవారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ పర్యాటక ప్రమోషన్,
సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింభించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం అయ్యాయని చెప్పారు.ఈ ఈవెంట్ను అపూర్వ విజయంగా నిలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటకం, హస్తకళలు, చేనేత ఉత్పత్తులకు మంచి ప్రమోషన్ వచ్చిందని, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రపంచానికి పరిచయం చేశామని చెప్పారు. ఆ వేడుకల నిర్వహణ, ఆతిధ్యం పట్ల కంటెస్టెంట్లు, మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు సైతం ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ పోటీల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అభినందించాల్సి పోయి విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ పోటీలపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని, గొప్పగా కార్యక్రమం నిర్వహిస్తే పలుచన చేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల విమర్శలు చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు.
రూ.200 కోట్లు ఖర్చు అయినట్లు నిరూపించాలని సవాల్
మిస్ వరల్ పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ కు రావాలా? అబిడ్స్ చౌరస్తాకు రావాలా? రూ.200 కోట్లు ఖర్చు అయినట్లు నిరూపించకుంటే ముక్కు నేలకు రాయాలని మంత్రి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో టూరిజం ప్రమోషన్లకే రూ.115 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిపారు. ఇంత పెద్ద ఈవెంట్ ను తక్కు ఖర్చుతో ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. సొంత పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేశారని, అందగత్తెల కాళ్లు కడిగారని విష ప్రచారం చేశారని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్నఘనత కేసీఆర్దేనని అన్నారు. కంటెస్టెంట్లకు 30 తులాల బంగారం ఇచ్చారనేది పచ్చి అబద్ధం’ అని ఖండించారు. 30 తులాలు కాదు, మూడు గ్రాములు కూడా ఇవ్వలేదని తెలిపారు. చౌమహల్లా ప్యాలెస్ విందులో ఒక్కో ప్లేట్ భోజనానికి లక్ష రూపాయాలు ఖర్చు చేశారనేదీ అవాస్తమని, ఒక్కో ప్లేట్ కు అయిన ఖర్చు రూ.8,200 మాత్రమేనని స్పష్టం చేశారు.
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణ వాస్తవం లేదు
తనపట్ల తప్పుగా ప్రవర్తించారని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలను మంత్రి జూపల్లి ఖండించారు. ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. దీనిపై కొందరు బీఆర్ఎస్ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్ని అభూతక కల్పనలేనని తోసిపుచ్చారు. మిస్ ఇంగ్లాండ్ ను ఇబ్బంది పెట్టారనేది వాస్తవం అయితే మిగతా 108 మంది పోటీదారులు చివరి వరకు ఉండేవారు కాదన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులుగా వచ్చిన వారు చివరిదాకా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. ఏమీ జరగని దానికి ఏదో జరిగినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లను ఇబ్బంది పెడితే, మళ్లీ మళ్లీ తెలంగాణకు రావాలని ఉందని ఎందుకు చెబుతారని ప్రశ్నించారు మిస్ వరల్ విన్నర్గా గెలిచిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాతకు తెలంగాణ ఆథిత్యం, ఇక్కడి పర్యాటక ప్రాంతాలు నచ్చాయని చెప్పారని మంత్రి తెలిపారు. తన జీవితంలో హైదరాబాద్ను మరువనని, అవకాశం వస్తే మళ్లీ ఇక్కడికి వస్తానని ఓపల్ సుచాత చెప్పారన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
రాజకీయ లబ్దికి అసత్యాలను ప్రచారం చేయొద్దు
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతంగా నిర్వహించడాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరం నోటీసులు, కెసిఆర్ కుటుంబంలో కలహాలు, ఇతరత్రా అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇటువంటి అనవసర విషయాలను లేవనెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసం అసత్యాలను ప్రచారం చేయడం తగదని మంత్రి పొన్నం హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, పర్యాటక శాఖ డైరెక్టర్ హన్మంతు జండగే, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ కె.లక్ష్మి పాల్గొన్నారు.