“ఆ సంఘటనతో నా గుండె పగిలినంత పనైంది. మా విజయాన్ని కళ్లారా చూడకుండానే ఆ చిన్నారులు కన్నుమూయడం ఎంతో బాధాకరం. నాపై వారు చూపించిన ప్రేమ మరువలేనిది’ అంటూ చార్మినార్ గుల్జార్ హౌజ్ ఘటనలో చనిపోయిన ఇద్దరు బాలికల గురించి మిస్ వరల్డ్- 2025 కిరీట విజేత థాయిలాండ్ సుందరీమణి ఓపల్ సుచాత ఆందోళన చెందారు. ఎంతో భావోద్వేగంతో ఓపల్ సుచాత తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ట్వీట్ చేశారు. మే 18న హైదారాబాద్లోని చార్మినార్ ప్రాంతంలో గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఓపల్ సుచాత స్పందించారు. ప్రమాదం జరుగక ముందు తన పర్య్యటనలో భాగంగా గుల్జార్ హౌజ్లో మోడీ పెరల్స్ షాపును సందర్శించిన విషయాన్ని, ఆ సమయంలో కలిసిన చిన్నారులు ప్రమాదంలో కన్నుమూశారని తెలుసుకోని ఆవేదనకు గురయ్యారు.
తన పర్యటనలో ముత్యాల షాప్లో తాను గడిపిన క్షణాలను ఆనందాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తెల్లటి, జీబ్రా-నమూనా దుస్తులు ధరించిన అమ్మాయిలు తనను కలవడానికి, ఫోటోలు తీయడానికి ఆసక్తిగా ఉన్నారని ఆమె ప్రేమగా గుర్తు చేసుకున్నారు. ఆ చిన్నారులు తనను వారి ఇంటికి ఆహ్వానించారని, అయితే మరోసారి వస్తానని వారికి చెప్పినట్లుగా సుచాత పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లలతో పాటు, కుటుంబ సభ్యులు ప్రమాదంలో చనిపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు నా పై చూపించిన ప్రేమ మరువలేనిదని ఆ ట్వీట్లో ప్రపంచ సుందరి తెలిపారు. వారికి ‘స్వర్గ ప్రాప్తిరస్తు..మన తదుపరి జీవితంలో మళ్ళీ కలుద్దాం’ అంటూ ఎంతో ఆవేదనతో ఆ దుకాణంలో చిన్నారులతో దిగిన ఫోటోను ఓపల్ సుచాత తన పోస్ట్కి జత చేసి విడుదల చేశారు.