బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వరక్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రం అపరిమిత వినోదాన్ని అందించనుందనే నమ్మకాన్ని టీజర్ కలిగించింది. తాజాగా ’మిత్ర మండలి’ నుంచి మొదటి గీతం ‘కత్తందుకో జానకి’ని నిర్మాతలు విడుదల చేశారు. ఈ గీతావిష్కరణ కార్యక్రమం అమలాపురంలోని కిమ్స్ కాలేజ్లో జరిగింది.
రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebel star Krishnamraju) ఐకానిక్ డైలాగ్ ‘కత్తందుకో జానకి’ని తీసుకొని, ఈ తరం మెచ్చేలా అద్భుతమైన పాటగా మలిచారు. ఆర్.ఆర్. ధృవన్ స్వరపరిచిన ఈ గీతం.. వినసొంపుగా, అందరూ సరదాగా పాడుకునేలా ఉంది. అమలాపురం కిమ్స్ కాలేజ్ లో జరిగిన ’కత్తందుకో జానకి’ గీతావిష్కరణ వేడుకకు ముఖ్య అతిథిగా అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి హాజరయ్యారు. అలాగే కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు, ఎండీ రవివర్మ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు బన్నీ వాస్, నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల, నటీనటులు ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, దర్శకుడు విజయేందర్ ఎస్, సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ తదితరులు సందడి చేశారు.