మన తెలంగాణ/హన్మకొండ: మాజీ ఎంఎల్సి కొండా మురళి పార్టీ పై ఎమ్మెల్యేలపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఘాటుగా సమాధానం చెప్పారు. గురువా రం సాయంత్రం వరంగల్లో కొండా మురళి చేసిన వ్యా ఖ్యల నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, బస్వరాజు సారయ్య, మేయర్ సుధారాణి,కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్ రామ్ రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ పరంగా మాట్లాడుకోవడం జరిగిందని, పార్టీ గీత దాటి కొండ మురళీ మాట్లాడటం పద్ధతి కాదన్నారు. నేతలు నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. కులాలు అడ్డు పెట్టకుని నచ్చినట్లుగా మాట్లాడుతామంటే కుదరదని, ఇక్కడ అన్ని కులాల వారు ఉన్నారని అన్ని కులాలతో కలుపుకుని పోతున్నామని అన్నారు. ఇలా కులాల పేరుతో దూసిస్తే వారు చేసిన పాపాలు పోతాయా అంటూ కొండా మురళిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ పరంగా, లేదా ఇతర సమస్యలు ఇబ్బందులు ఏమైనా ఉంటే పార్టీ నాయకత్వానికి చెప్పుకోవాలి కానీ, ఇలా నోటికి వచ్చినట్లు అడ్డగోలుగా రోడ్లపై మాట్లాడటం మంచి పద్దతి కాదని, ఇలా మాట్లాడి మీ సీనియారిటీకి రాజకీయకి మిరే దెబ్బ తీసుకుంటున్నారని హెచ్చరించారు. ఈపాపాలను తాము ఎక్కువ కాలం మోయలేమని స్పష్టం చేశారు. పార్టీ అధినాయకత్వం ఈ అంశంపై వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో గొడవ పెట్టాలని చూస్తున్నారని, ఇందులో తాడోపేడో తేల్చాల్సిందేనని అన్నారు. ఇలాంటి వారి వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని, అందరం కలిసి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెయ్యిల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి చిల్లర రాజకీయ చేసే వారి వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని, ఇలాంటి వారిపై అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అధిష్టానానికి దృష్టికి తీసుకువెళ్లి వినతిపత్రం అందిస్తామని తెలిపారు.