భారత రాష్ట్ర సమితి ఎంఎల్సి కల్వకుంట్ల కవిత గురువారం చేసిన సంచలన ఆరోపణలు టీ కప్పులో తుఫాను అనేలా కొట్టిపారేసే పరిస్థితి లేదు. కొద్ది రోజుల క్రితం ఆమె చేసిన విమర్శలకు కొనసాగింపుగా తాజాగా చేసిన ఆరోపణలతో ఆమె తన దూకుడును మరింతగా పెంచినట్లు కనిపిస్తున్నది. చివరకు ఇవి పార్టీలో ఎలాంటి విపరిణామాలకు దారితీస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. కవిత ఆరోపణల తీవ్రత పెరగడంతో పార్టీ చర్యలు తీసుకోవలసిన అనివార్య పరిస్థితిని కల్పించింది. అయితే ఏ విధంగా పార్టీ స్పందిస్తుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివాదం కెసిఆర్ తనయ కవిత, తనయుడు కెటిఆర్ చుట్టూ తిరగడం తో కెసిఆర్ ఎలా స్పందిస్తారనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. కవిత చేసిన ఆరోపణలు సాధారణమైనవి కా వు. ఆమె తాజాగా రెండు కుట్రలను బయటపెట్టారు. ఒక టి ఎంపి ఎన్నికల్లో తనను ఓడించారని, దీని వెనుక ఎవరున్నారో తెలుసని ప్రకటించారు.
మరొకటి, బిఆర్ఎస్ను బిజెపిలో విలీనం చేసే కుట్ర తాను తీహారు జైల్లో ఉన్నప్పుడే మొదలైందని అప్పుడే తాను వ్యతిరేకించానని కవిత గురువారం చిట్చాట్లో సంచలనంగా ప్రకటించారు. ఇవి సొంత పార్టీ బిఆర్ఎస్లోనే కాక కాంగ్రెస్, బిజెపిలో పెను ప్రకంపనలు సృష్టించాయి. ఈ విమర్శలు అటు తండ్రి కెసిఆర్ను, సోదరుడు కెటిఆర్ను ప్రశ్నించే విధంగా పరోక్షంగా బయటకు వచ్చాయి. రెండు సందర్భాల్లో కవిత తన సోదరుడు కెటిఆర్ను పరోక్షంగా టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తున్నది. మరో వైపు తాను పార్టీ అధినేత కెసిఆర్కు అంతర్గతంగా వంద లేఖలు రాశానని వాటిని కెసిఆర్ చదివాక చింపివేస్తారని కాని ఈ లేఖ ఎలా బయటికి వచ్చి మీడియాలో వైరల్గా మారిందని కవిత అనుమానపు అస్త్రాలను సంధించారు. ‘కెసిఆర్ దేవుడు చుట్టూ దయ్యాలు’ అని అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎయిర్ పోర్ట్ లో చేసిన విమర్శల తదనంతర పరిణామాల్లో కవిత ఈ దఫా మరింత తీవ్రంగా ఆరోపణలు చేశారు. దీనితో కవిత పరోక్ష విమర్శల విషయమై ఆ పార్టీ తర్జనభర్జనల్లో తలమునకలైనట్లుగా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ విమర్శల పరిణామాలు ఏ దిశగా వెళుతాయనేది చెప్పలేని తరువాయి 8లో
(మొదటిపేజీ తరువాయి)
పరిస్థితి కనిపిస్తున్నది. కవిత కెసిఆర్యే తన నాయకుడని ప్రకటిస్తూ ఆయనకు కాళేశ్వరం కమిషన్ నోటిసులు ఇస్తే పార్టీ నుంచి ఎందుకు నిరసనలు రాలేదంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ఆ పార్టీలోనే మరో నాయకుడికి నోటీసులు వస్తే పార్టీ నుంచి నిరసనల రూపంలో వచ్చిన స్పందన కెసిఆర్ విషయంలో ఎందుకు రాలేదని ఆమె పరోక్షంగా కెటిఆర్ను ఉద్దేశిస్తూ అస్త్రాన్ని సంధించారు. బిఆర్ఎస్లో అందరూ సమానమేనని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను కౌంటర్ చేస్తున్నట్లుగా పార్టీలో కెసిఆర్ ఒక్కరే నాయకుడని ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని కవిత స్పష్టం చేశారు. కెసిఆర్కు తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారో వెలికి తీయమని తాను ప్రశ్నిస్తే లీక్ వీరులను వదిలేసి గ్రీకు వీరులతో సోషల్ మీడియాలో తనపై దండయాత్ర చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని ప్రస్తావిస్తూ, కోవర్టులు ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె నేరుగా పార్టీ నేతలను ప్రశ్నించారు.
కవిత చిట్చాట్లో చేసిన ఆరోపణలపై కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ల నుంచి స్పందనలు వచ్చాయి. కవిత విలీనం ప్రతిపాదన బిఆర్ఎస్, బిజెపి ఎన్నికల లోపాయికారి పొత్తును బయటపెట్టిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. బిజెపిలో ఎంఎల్ఎ రాజాసింగ్ మాట్లాడుతూ కవిత ఆరోపణలో వాస్తవం ఉందని విలీనం చేసే ప్రతిపాదనను తాను ఎప్పుడో బయటపెట్టానని చెప్పారు. బిజెపిలో కీలకమైన నేతగా ఉన్న ఈటల రాజేందర్ మాత్రం విలీనం అవసరం ఏమిటి అని ప్రశ్నించారు. కవిత ఆరోపణలు ఆ పార్టీలోని అంతర్గత సంక్షోభాన్ని బయటపెట్టాయని ఈటల విమర్శించారు. కవిత చేసిన విమర్శలను విశ్లేషిస్తే కెసిఆర్ మౌనాన్ని ప్రశ్నించడమే కాకుండా సోదరుడు కెటిఆర్పై పరోక్షంగా విమర్శలు చేశారు.
బిఆర్ఎస్ మాజీ ఎంపి వినోద్ స్పందిస్తూ ఇలాంటి ప్రకంపనలు అన్ని పార్టీల్లో సాధారణమేనని కొట్టిపారేశారు. అయితే కవిత మనసులో ఇంత ఆవేదన ఉందని ఇప్పుడే అర్థమైందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయినా తాను కవితతో మాట్లాడుతానని ప్రకటించారు. కాని ఇంతకు ముందే పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు దామోదర రావు, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గండ్ర మోహన్ రావులు కవితతో సుదీర్ఘంగా చర్చలు జరిపినా ఫలితం కనిపించకపోవడంతోనే ఆమె మరోసారి ధ్వజమెత్తారు. కవిత ఆరోపణలపై ఎవరూ స్పందించకూడదని కెసిఆర్ ఆదేశించడంతో మాజీ ఎంపి వినోద్ మినహా ఎవరూ నోరు విప్పడం లేదు. ప్రస్తుతం కెటిఆర్ లండన్, అమెరికా పర్యటనలో ఉండడంతో అక్కడ కూడా కవిత ఆరోపణలు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.