బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బనకచర్ల వివాదంపై ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బనకచర్ల ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. తమకు బేసిన్లు లేవు బేషజాలు లేవని అప్పుడు కెసిఆర్ అన్నారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు కెసిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా మాట్లాడారా? రాయలసీమ ముఖ్యమంత్రిగా మాట్లాడారా? అని ప్రశ్నించారు. బనకచర్ల నిర్మాణానికి అప్పుడు అవకాశం ఇచ్చారని, రాయలసీమ రతనాల సీమగా మారాలని కోరుకుంటున్నానని అప్పట్లో కెసిఆర్ అన్నారని అద్దంకి గుర్తు చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ పేరిట గ్రాఫిక్స్ మాయజాలం చేశారని ఆయన విమర్శించారు. అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కెసిఆర్
నాలుగు పర్యాయాలు ప్రగతి భవన్కు ఎందుకు ఆహ్వానించారని ఆయన ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కెసిఆర్ ఎందుకు హాజరుకాలేదని ఆయన ప్రశ్నించారు. నాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న టి. హరీష్ రావు తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మిగులు జలాల ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వరాదని హరీష్ రావు ఎందుకు డిమాండ్ చేయడం లేదని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరిట బ్యాగులు మోసుకెళ్ళారని ఆయన విమర్శించారు. జల ద్రోహానికి పాల్పడిన దొంగలని ఆయ న దుయ్యబట్టారు. ఇటువంటి ప్రతిపక్ష నేత అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ తన కుమార్తె కవితకు నోటీసు ఎందుకు ఇవ్వడం లేదని అద్దంకి ప్రశ్నించారు.