అంతమాత్రాన నన్ను రేవంత్ కోవర్టు అంటారా? పెయిడ్ పోస్టులతో
బద్నాం చేస్తే ఊరుకోను బిఆర్ఎస్ ట్వీట్లకే పరిమితమైంది మా నాన్నకు
లేఖ రాస్తే తప్పేంటి? ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్లో మెసేజ్లు పెడితే
చాలా? అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయింది? లీక్వీరులను
ఎండగట్టమంటే గ్రీక్ వీరుల్లా నాపై ప్రతాపం చూపిస్తున్నారు ఇంటి
ఆడబిడ్డపై ఎలా పడితే అలా మాట్లాడించడం మర్యాదేనా? నేను
ఎంపిగా పోటీ చేస్తే సొంత పార్టీ ఎంఎల్ఎలే ఓడించారు తెలంగాణ
తెచ్చిన కెసిఆర్కు నోటీసులు వస్తే పార్టీ నేతలు ఎవరూ స్పందించలేదు
మరో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారు? కడుపులో
బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా నన్ను విమర్శించే
నేతలు చేసిన కార్యక్రమాలు ఏంటో చెప్పాలి ఇది నా పార్టీ.. నన్ను
పార్టీలోంచి బయటకు పంపే దమ్ము ఎవరికీ లేదు కెసిఆర్ తప్ప ఇతరుల
నాయకత్వంలో పని చేయను చిట్చాట్లో కవిత సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ను గంపగుత్తగా బిజెపికి అప్పగించే ప్రయత్నం జరుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తాను జైలులో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వస్తే వ్యతిరేకించానని గుర్తు చేశారు. తొందరపా టు నిర్ణయం వద్దని జైల్లో ఉన్నప్పుడు కెసిఆర్కు సూచించానని తెలిపారు. బిజెపిలో బిఆర్ఎస్ విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే తన అభిమతం అని వ్యాఖ్యానించారు. మనదేశంలోని న్యాయవ్యవస్థపై నాకు నమ్మ కం ఉందని, ఆరు నెలలు కాదు.. సంవత్సరాలు అయినా జైల్లో ఉంటానని చెప్పానని పేర్కొన్నారు. కాంగ్రెస్తో సం ప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, ఆ పార్టీ బలంగా ఉంటే బిజెపి ఇన్ని సార్లు ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీతో టచ్ లో లేక పన్నెండేళ్లు గడించిందని చెప్పారు. తన పార్టీ బిఆర్ఎస్ అని, తన నాయకుడు కెసిఆర్ అని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ మాత్రమే తనకు నాయకుడు అని, ఆయన నాయకత్వంలోనే తాను పనిచేస్తానని స్ప ష్టం చేశారు.
వర్కింగ్ ప్రెసిడెంట్కు ఇవ్వాల్సిన ప్రొటోకా ల్, గౌరవం ఉంటుందని చెప్పారు. ఎంతోమంది నేతలు వస్తుంటారని, తనకు కెసిఆర్ మాత్రమే నాయకుడు.. హీరో అని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ తన పార్టీ అని, పార్టీ కోసం గట్టిగా పోరాడతానన్నారు. కెసిఆర్ మళ్లీ సిఎం అవుతారు అని, అందులో ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత గురువారం బం జారాహిల్స్లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఎల్సి కవిత సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారు..? అంత సీన్ లేదు అంటూ కొట్టిపారేశారు. వెన్నుపోటు పొడవడం నా లక్షణం కాదు అని, తాను నేరుగానే పోరాడతానని చెప్పారు. కొత్త పార్టీ అవసరం లేదు.. ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు అని వ్యాఖ్యానించారు.
ఆ లేఖ ఎలా లీక్ అయింది?
బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం, తన తండ్రి కెసిఆర్ను తాను లేఖ ద్వారా అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని ఎంఎల్సి కవిత ప్రశ్నించారు. లేఖలో తాను చేసిన సూచనల్లో ఒక్కటైనా తప్పుందా..? అని అడిగారు. తమ పార్టీ వాళ్ళు కొందరు.. సోషల్ మీడియాలో మహాభారతం క్యారెక్టర్లు వేస్తున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కెసిఆర్ను మోస్తున్నట్లు కార్టూన్లు వేయించుకున్నారని మండిపడ్డారు. వాళ్లు కెసిఆర్ను నడిపించేంత పెద్దవాళ్లు అయ్యారా…? అని నిలదీశారు. వా రు స్థాయికి మించి ఊహించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. వరంగల్ సభ తమ వల్లనే సక్సెస్ అయిందని కొందరు ఊహించుకుంటున్నారని అన్నారు.
వాళ్లు కెసిఆర్ను మోసేంత పెద్ద వాళ్ళు అయిపోయామని భావిస్తున్నారని, కానీ కెసిఆరే అందరినీ మోస్తున్న విషయం గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపులో విషం పెట్టుకుని బయటకు నవ్వుతూ ఉండలేను అని, తా ను గత 20 ఏళ్లుగా తన తండ్రికి వందల లేఖలు రాశాను అని, అందులో తప్పేంటి..? ప్రశ్నించారు. సాధారణంగా కెసిఆర్ లేఖను చదివాక చింపుతారు అని, కానీ ఈసారి అలా చింపలేదని చెప్పారు. తాను రాసిన లేఖ బయటకురావడంలో కుట్ర ఎవరు చేశారో తనకు తెలియదు అని, అదే బయటపెట్టాలని తాను అంటున్నానని పేర్కొన్నారు. లీకు వీరులను ఎండగట్టమంటే గ్రీకు వీరుల్లా తనపై ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. పెయిడ్ మీడియా, సోషల్ మీడియా ద్వారా తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు.
దొంగల్ని పట్టుకోమంటే చేతగాక
నాపై ప్రతాపం చూపితే ఎలా?
దేశం వెలుపల ఐటీ సెల్లు పెట్టి తనపై పోరాడుతామంటే ఎలా..? అని ఎంఎల్సి కవిత ప్రశ్నించారు. దొంగల్ని పట్టుకోమం టే చేతగాక తనపై ప్రతాపం చూపితే ఎ లా? అని అడిగారు. పార్టీ తనది అని ప్రతి ఒక్కరూ పోరాడితేనే ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సా ధించి, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కెసిఆర్కు నోటీసులు ఇస్తే.. కేవలం ట్విట్టర్లో పోస్టు పెట్టి వదిలేస్తే ఎలా..? అని అడిగా రు. గ్రామస్థాయి నుంచి ఆందోళనలు చేపట్టేందుకు ఎందుకు కార్యాచరణ తీసుకోలేదని నిలదీశారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలపై మాట్లాడాలి కానీ, తనపై దాడి చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. బిజెపి నేతలకు చెందిన హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరో అందరకీ తెలుసునంటూ పార్టీలోని అగ్రనేతలను ఆమె పరోక్షంగా విమర్శించారు. కెసిఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీ నేతలెవరూ స్పందించలేదని,
పార్టీలో మరో నేతకు నోటీసులు ఇస్తే ఎందుకు హంగామా చేశారని అడిగారు. అలాంటి వాళ్లు తనకు నీతులు చెబుతూ కోవర్టులు ఉన్నారంటున్నారని మండిపడ్డారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని ఒప్పుకుంటున్నప్పుడు వాళ్లను ఎందుకు పక్కన పెట్టడం లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం విషయంలో కెసిఆర్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. ఈ విషయం ఆయన కింద ఉన్న వారు ఆలోచించుకోవాలని సూచించారు. తనను కాంగ్రె స్ కోవర్ట్ అంటున్నారు.. మరి బిఆర్ఎస్లో బిజెపి కోవర్టులు ఉన్నారనుకోవాలా? అని సందేహం వ్యక్తం చేశా రు. తన మీద పడి ఏడిస్తే ఎలా.. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదనేనా..? అని అడిగారు. తాను అమెరికా నుంచి రాగానే కెసిఆర్కు ఇచ్చిన నోటీసులపై ఆందోళనలకు కార్యాచరణ చేపడతామని భావించానని, కానీ తాను రాసిన లేఖ లీకు కావడంతో ఆ విషయంపైనే స్పందించానని చెప్పారు. కానీ కెసిఆర్కు నోటీసులు రావడంపై ఇప్పటికీ పార్టీ కార్యాచరణ చేపట్టలేదని మండిపడ్డారు.
మమ్మల్ని విడదీసే కుట్ర జరుగుతోంది
తనను, కెసిఆర్ను విడదీసే కుట్ర చేస్తున్నారని ఎంఎల్సి కవిత ఆరోపించారు. తన తండ్రిని, తన కుటుంబాన్ని వదిలి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. తనను దూరం చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలన్నారు. పార్టీ నేతలు దామోదర్ రావు, గండ్ర మోహన్రావులు తనతో మాట్లాడితే వారికి కూడా జరిగిన వాస్తవాలు చెప్పానని పేర్కొన్నారు. కెసిఆర్ లెక్క.. తాను కూడా సూ టిగా, మొండిగా వ్యవహరిస్తానని పునరుద్ఘాటించారు. వెన్నుపోటు రాజకీయాలు తెలీదని.. ఏ విషయమైనా సూటిగా మాట్లాడుతానని కుండ బద్దలు కొట్టారు. ఎవరైనా తన జోలికి వస్తే ఊరుకోను అని హెచ్చరించారు.
కడుపులో బిడ్డను పెట్టుకుని
ఉద్యమంలో పనిచేశాను
తాను ఏనాడూ పదవుల కోసం పాటుపడలేదని కవిత తెలిపారు. లిక్కర్ కేసు సమయంలో తాను తన పదవికి, పార్టీ సభ్వత్వానికి రాజీనామా చేస్తానంటే కెసిఆర్ వద్ద వారించానని పేర్కొన్నారు. కెసిఆర్ వద్దంటేనే తాను ఈ పదవిలో కొనసాగుతున్నానన్నారు. కెసిఆర్ను ఏమీ చేయలేక తనపై కేసులు నమోదు చేయించారని పేర్కొన్నారు. తాను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో 2006 నుంచి సైనికురాలిగా పనిచేశానని గుర్తు చేశారు. కెసిఆర్ ఇచ్చిన పిలుపుకు ఆకర్షితురాలిని అయి తన వ్యాపారాలు వదులుకుని ఎనిమిదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశానని చెప్పారు. తనను విమర్శిస్తున్న నేతలు కెసిఆర్ నీడన ఉన్నారు తప్ప.
. వాళ్లు సొంతంగా చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి? అని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి ఉద్యమ సంస్థ అని, అది ఇవాళ పుట్టింది కాదు అని పేర్కొన్నారు. పార్టీ చేయని కార్యక్రమాలను జాగృతి తరఫున చేస్తున్నానని, సాంస్కృతిక, సమకాలీన అంశాలపై బలంగా పోరాడామని చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ చేయాల్సిన సగం పనులను జాగృతి తరపున చేస్తున్నామని చెప్పారు. కెసిఆర్ చెప్పినట్లుగా ప్రజల కోసం పనిచేస్తే పదవులు, గుర్తింపు వస్తుందని నమ్మి పనిచేశానని పేర్కొన్నారు. తాను చిచోరా పనులు చేయను అని, హుందాగా వ్యవహరిస్తానని అన్నారు. తాను ఎంపీగా పోటీ చేస్తే సొంత పార్టీ ఎంఎల్ఎలే కుట్రపూరితంగా ఓడించారని, ఆవిషయం తెలుసుకున్న కెసిఆర్ అదే జిల్లాలో ప్రొటోకాల్ ఉంటే బాగా పనిచేస్తావు అని చెప్పి తనను ఎంఎల్సిని చేశారని అన్నారు.
రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ
తర్వాతే గోదావరిపై బనకచర్ల
తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని ఎంఎల్సి కవిత అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసేలా గోదావరి- బనకచర్ల చేపడుతున్నారని ఆరోపించారు. ఎన్డిఎలో ఉన్నందున కేంద్రం ఏమీ అనదని చంద్రబాబు ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డితో భేటీ తర్వాతే చంద్రబాబు గోదావరి -బనకచర్ల చేపట్టారని తెలిపారు. అందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఎపి సిఎం చంద్రబాబు ఏమి చేసినా.. కేంద్రం అడ్డుకోవటం లేదని ఒకింత అసహనాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇప్పటికీ గోదావరి నదీ జలాలు పంపకం సరిగా జరగలేదన్నారు. ఎపి చేపట్టనున్న బనకచర్ల ప్రాజక్టుతో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్లో తనకు నీతులు చెబుతున్న నాయకులు ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. గోదావరి -బనకచర్ల అంశం వచ్చినప్పుడు పెద్దఎత్తున కార్యాచరణ చేపడతామని అన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం తాను పోరాడుతాననని ఎంఎల్సి కవిత వెల్లడించారు.