ఆంధ్ర ప్రదేశ్ లో కలిపిన పోలవరం ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 25వ తేదీన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రగతి ఎజెండా పేరిట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించబోయే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని అన్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోలవరం తెలంగాణపై జలకడ్గం – ముంపు గోడుపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏపీలో కలిపిన ఫురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల మధ్య వివక్షకు గురవుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందని తెలిపారు.
లేదంటే భారీ వరదలు వస్తే అన్ని గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందని అన్నారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని, భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందని తెలిపారు. భద్రాచల శ్రీరాముని గుడి తెలంగాణలో ఉండగా గుడికి సంబంధించిన వెయ్యి ఎకరాల దేవుని మాన్యం ఆంధ్రాలో ఉందని అన్నారు. అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ముంపుపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్త సర్వే నిర్వహించాలని సూచించారు. ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీం కోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. 2014లో ప్రధాని మోదీ మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్ను ఆమోదించి అన్యాయం చేశారని విమర్శించారు. ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని, లోయర్ సిలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా ఏపీ అప్పజెప్పారని మండిపడ్డారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు ఏడు మండలాలను తీసుకున్నారని ఆరోపించారు. ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని దుయ్యబట్టారు. అప్పుడే పార్లమెంటులో తాము గళమెత్తామని, బీఆర్ఎస్ పార్టీ సభ్యులం పార్లమెంటులో మాట్లాడాము కానీ కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఆ నాడు కూడా ఏమి పట్టనట్టు వ్యవహరించారని తెలియజేశారు. అనంతరం సీపీఐ – ఎంఎల్ (న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ మాట్లాడుతూ,
కేంద్రంలో చంద్రబాబు కీలకంగా ఉండటంతోనే 2014లో అవసరం లేకపోయినా తెలంగాణలోని ఏడు మండలాలను నరేంద్రమోదీ ప్రభుత్వం ఆంధ్రలో విలీనం చేసిందని అన్నారు. భద్రాచల రాముడికి మోదీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. పోలవరం ముంపులో భాగం కాని ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలుపుతూ ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు. భద్రాచలంతో తెలంగాణ ప్రజలకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. భద్రాచలం లేని తెలంగాణను ఊహించడం కష్టమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఐదు గ్రామ పంచాయతీల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో భద్రాచలం డెవలప్మెంట్ ఫోరం, ఐదు గ్రామ పంచాయతీల హక్కుల సాధన సమితి నాయకులు జంగిలి సంపత్, ఆవులూరి సత్యనారాయణ, దాసరి బాలకృష్ణ, రాసాల నర్సయ్య, గొల్లపల్లి శివ, కాటిబోయిన ఆనంద్, వివిధ ప్రజాసంఘాల నాయకులు వీరన్న, రూప్ సింగ్, లోకిని రాజు, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.