తెలంగాణ జాతిపితకు నోటీసులా?
రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణంగా
మార్చినందుకు ఇచ్చారా? రైతు బీమా,
రైతుబంధు ఇచ్చినందుకు ఇచ్చారా?
నోటీసులకు నిరసనగా 4న మహాధర్నా
సిఎం రేవంత్కు తెలంగాణ సోయి లేదు
జై తెలంగాణ అనని రేవంత్ సిఎం పీఠంపై
కూర్చోవడానికి అనర్హుడు బాబు గోదావరి
జలాలు తరలించుకు పోతుంటే నోరు
విప్పడం లేదు తెలంగాణ జాగృతి
అధ్యక్షురాలు, ఎంఎల్సి కవిత ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్కు బిఆర్ఎస్ పార్టీ ఒక క న్ను అయితే తెలంగాణ జాగృతి మరొక కన్ను అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కెసిఆర్పై ఈగ వా లినా ఊరుకోబోమని హెచ్చరించారు. కెసిఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసి స్తూ జూన్ 4న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చే పడుతున్నట్లు ప్రకటించారు. బంజారాహిల్స్లోని తన నివాసం సమీపంలో శనివారం నాడు తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ప్రారంభించారు.కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన తర్వాత అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రీ బాయి పూలే, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలకు పూష్పాంజలి ఘటించారు. అనంతరం నూతన కార్యాలయంలో తొలి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
గోదావరి జలాల్లో 200 టిఎంసిల హక్కు తెలంగాణకు ఉండాలని కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని ఎంఎల్సి కవిత గుర్తు చేశారు. ప్రతీ ఏడాది 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కెసిఆర్కు నోటీసులు ఇచ్చారా.. కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను చేసిందుకు కెసిఆర్కు నోటీసులు ఇచ్చారా.. రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశ పెట్టినందుకు నోటీసులు ఇచ్చారా..తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా.. అది కాళేశ్వరం కమిషనా లేదా కాంగ్రెస్ కమిషనా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కెసిఆర్కు నోటీసులు ఇవ్వడం పట్ల ఇవాళ ప్రతీ తెలంగాణ బిడ్డ బాధపడుతున్నారని చెప్పారు. తెలంగాణ జాతిపిత కెసిఆర్కు నోటీసులు ఇవ్వడమంటే … యావత్తు తెలంగాణకే నోటీసులు ఇచ్చినట్లు అని స్పష్టం చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ
కెసిఆర్ తెలంగాణ సోయితో పరిపాలన చేశారని ఎంఎల్సి చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ అని, కనీసం ఇప్పటికైనా సిఎం జై తెలంగాణ అనాలి.. అమరులకు నివాళులర్పించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులులర్పించని వారికి సిఎం కుర్చిలో కూర్చొనే అర్హత లేదని స్పష్టం చేశారు. తెలంగాణ గ్రహచారం బాగలేక తెలంగాణకు రేవంత్ రెడ్డి సిఎం అయ్యారని మండిపడ్డారు. కెసిఆర్ పిడికిలికెత్తి బయటికి వస్తేనే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ వాళ్లు అధికారంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఆ విషయాన్ని మరిచిపోయి కెసిఆర్కు నోటీసులు ఇవ్వడం దారుణమని విరుచురుపడ్డారు.
రాజీవ్ యువ వికాసం పథకం పేరు మార్చాలి
యువతకు స్వయం ఉపాధి కోసం ప్రారంభిస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం పేరు మార్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఎటువంటి సంబంధం లేని రాజీవ్ గాంధీ పేరు పెట్టడం సరికాదని సూచించారు. అమరులు శ్రీకాంతా చారి లేదా యాది రెడ్డి లేదా ప్రజాకవి కాళోజి లేదా మాజీ ప్రధాని పివి నరసింహా రావు పేరు పెట్టాలని సూచించారు. తెలంగాణ నీళ్లను ఎపి తరలించుకుపోతుంటే సిఎం రేవంత్ రెడ్డి మాట్లడని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం సిఎం ఎందుకు పనిచేస్తున్నారు..?
ఎపి సిఎం చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి నీళ్లు తరలించాలనుకుంటున్నా సిఎం కనీసం స్పందించడం లేదని ఎంఎల్సి కవిత విమర్శించారు. ఎందుకు సిఎం అంత బలహీనంగా ఉన్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు. కెసిఆర్ సిఎంగా ఉన్నప్పుడు నదుల అనుసంధానాన్ని తుపాకులగూడెం నుంచి చేపట్టాలని ప్రతిపాదించారని, కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచి చేపడుతామని చెప్పిందని వివరించారు. కానీ ఇప్పుడు పోలవరం నుంచి 200 టిఎంసిల గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. గోదావరి నీళ్లను తెలంగాణకు శాశ్వతంగా దూరం కానున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 2 నాడు సిఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిఎం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సూచించారు.
బిసి బిల్లును బిజెపికి సెగ తాకేలా పోరాటం చేస్తాం
రాష్ట్ర శాసన సభ, శాసన మండలి పాస్ చేసిన బిసి బిల్లులను ఆమోదించకుండా తాత్సారం చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఎంఎల్సి కవత విరుచుకుపడ్డారు. తెలంగాణ జాగృతి బిసి బిల్లు కోసం గత ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నదని గుర్తు చేశారు. ఇటీవల ప్రధాని మోదీని సిఎం రేవంత్ రెడ్డి కలిసిన సమయంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడారు కానీ బిసి బిల్లు మీద మాట్లాడలేదని ఎండగట్టారు. బిసి బిల్లును డీ ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే బిజెపికి సెగ తాకే విధంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైల్ రోకో వంటి కార్యక్రమాన్ని చేడుతామని ప్రకటించారు. స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు జాగృతి పోరాటం చేస్తుందని, మహిళలకు రూ 2500, ఆడపిల్లలకు స్కూటీలు సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మైనారిటీ హక్కుల కోసం కూడా జాగృతి పోరాటం చేస్తుందని ప్రకటించారు. జాగృతిలో మైనారిటీ హక్కల కోసం ముస్లీం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలను ఏర్పాటు చేస్తామని, జాగృతి తరఫున ఎస్సి, ఎస్టి విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తామని తెలిపారు.
అయితే, తాము పోరాటాలు చేస్తుంటే కొంత మంది ఓర్వడం లేదని మండిపడ్డారు. కెసిఆర్కు ఒక కన్ను బిఆర్ఎస్ అయితే… మరో కన్ను జాగృతి అని తేల్చిచెప్పారు. తెలంగాణ కోసం బిజెపి నాయకులు మాట్లాడకపోవడం దారుణమని మండిపడ్డారు. 8 మంది ఎంపీలను గెలిపించినా కేంద్రం నుంచి ఒక్క రూపాయిని తీసుకురాలేదని, ఆంధ్రప్రదేశ్ నీళ్లు తరలించుకుపోతుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను కాపాడకపోతే తెలంగాణ జాగృతి పవర్ను చూపిస్తామని అన్నారు. కాగా, జాగృతి సంస్థను ప్రారంభించి దాదాపు 18 సంవత్సరాలు కావస్తుందని, తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏ అంశంపై అయినా బలంగా గొంతెత్తిందని వివరించారు. తెలంగాణ జాగృతి కెసిఆర్, జయశంకర్ సార్ స్పూర్తితో పుట్టిందని, తెలంగాణ సాంస్కృతిక అంశాలపై పనిచేయాలని జయశంకర్ సార్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. గతంలో అశోక్నగర్లో కార్యాలయం ఉండేదని, ఇప్పుడు బంజారాహిల్స్కు మార్చామని చెప్పారు. సలహాలు, సూచనలు ఇచ్చి తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకెళ్లిన వారికి ఎంఎల్సి కవిత ఉద్యమాభివందనాలు తెలిపారు.