మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కార్మికుల సంక్షేమ మే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగరేణిలోని 11 ఏరియాల కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పని చేస్తుందన్నారు. సింగరేణి కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేయాలని కుట్రలు పన్నుతోందని వాటిని అడ్డుకుంటామన్నారు. సంస్థలో 40 వేల మందికిపైగా కార్మికులు పని చేస్తుంటే వారిలో సగానికిపైగా యువకులే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కో ఆర్డినేటర్లను నియమిస్తున్నామని కవిత ప్రకటించారు.
సీబీఎస్ఈ సిలబస్లో విద్యాబోధన చేయాలి :
సింగరేణి స్కూళ్లను పునరుద్దరించి సీబీఎస్ఈ సిలబస్లో విద్యాబోధన చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యం అందజేయాలన్నారు. కార్మిక కాలనీల్లో మెరుగైన వసతులు కల్పించాలని, తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1970లో నిర్మించిన క్వార్టర్స్ కూలిపోయే దశలో ఉన్నాయని, అన్ని రీజియన్లలో కార్మికుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. భూగర్భ గనుల్లో ఎస్ డీ ఎల్ వెహికిల్స్ ను సింగరేణి కార్మికులతోనే నడిపించాల్సి ఉండగా ఆ మిషన్లను ప్రైవేటు వాళ్ల తో నడిపిస్తున్నారని, ఇది సింగరేణి నుంచి కార్మికులను తొలగించే కుట్ర అన్నారు. వెంటనే ప్రైవేట్ వ్యక్తులతో పని చేయించడం ఆపివేయాలన్నారు. సింగరేణి సంస్థ ద్వారా సమకూరుతున్న డీఎంఎఫ్ టీ నిధులను కార్మికులకు మెరుగైన వసతులు కల్పించడానికి వినియోగించుకుండా సీఎం, డిప్యూటీ సీఎంల నియోజకవర్గాలు కొడంగల్, మధిరకు తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించి సింగరేణిని రక్షించుకున్నామని.. అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోందన్నారు.