తరలింపు.. అరెస్ట్..విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిసి బస్ పాస్ చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ ఎంఎల్సి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బస్ భవన్ను ముట్టడించారు. తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం మధ్యాహ్నం బస్ భవన్కు చేరుకున్నారు. పోలీసులు అడ్డగించడంతో బస్ భవన్ ఎదుటే బైఠాయించి ఆందోళన చేపట్టారు. పెంచిన బస్ పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులపై పెను భారం మోపేలా ఒకేసారి 50 శాతం చార్జీలు పెంచడం దారుణమని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి బస్ పాస్ చార్జీలను పెంచడం అంటే ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కోవడమే అని పేర్కొన్నారు. ఆర్టిసి ప్రయాణికుల సంఖ్యకు సరిపడా బస్సు సర్వీసులు నడపడం లేదని, ఉన్న బస్సులను తగ్గించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్ భవన్ ఎదుట ఆందోళన చేస్తున్న ఎంఎల్సి కల్వకుంట్ల కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్ భవన్ నుంచి ఎంఎల్సి కవితను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కు, తెలంగాణ జాగృతి నాయకులను చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఎంఎల్సి కవిత, తెలంగాణ జాగృతి నాయకులను అరెస్టును నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు, జాగృతి కార్యకర్తలు కంచన్ బాగ్, చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లకు చేరుకున్నారు. సాయంత్రం కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు విడుదల చేశారు. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం ఎంఎల్సి కవిత మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ప్రజలను దోచుకోవడానికి అలవాటు పడిందని అన్నారు. బస్ పాస్ చార్జీలను పెంచి ప్రభుత్వం విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రమైన ఆర్థిక భారం మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆదాయం పెంచి ఆ సంపదను ప్రజలకు పంచుతామని, ఉద్యోగాలు ఇస్తామని నమ్మించిన కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనలో ప్రజల కోసం చేసిందేమి లేకపోగా ధరల పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని చెప్పారు. ప్రజలను ప్రభుత్వం పీల్చిపిప్పి చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని.. వారిపక్షాన తాము ఉద్యమిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అరెస్టులతో తమను అడ్డుకోలేరని తేల్చిచెప్పారు.
తెలంగాణ సంస్కృతికి జాగృతి అండగా నిలిచింది : ఎంఎల్సి కవిత
తెలంగాణ సంస్కృతికి తెలంగాణ జాగృతి అండగా నిలిచిందని ఎంఎల్సి కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ముషీరాబాద్, నాంపల్లి నియోజకవర్గాలకు చెందిన యువకులు జాగృతిలో చేరారు. వారికి కండువాలు కప్పి కవిత ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఒకప్పుడు సినిమాల్లో తెలంగాణ యాస అంటే అవహేళన ఉండేదని, ఇప్పుడు తెలంగాణ యాస లేనిది సినిమాలు లేవని పేర్కొన్నారు. కెసిఆర్ తెలంగాణ యాసలో ఉపన్యాసాలు ఇస్తూ మన యాసకు ప్రాచుర్యం కల్పించారని తెలిపారు.
తెలంగాణ యాసలో మాట్లాడటానికి ఎవరూ మొహమాట పడొద్దన్నారు. ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని యువత కాపాడుకోవాలని, ఇందుకు జాగృతి సైనికులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. తెలంగాణకు కెసిఆర్ తెచ్చిన గుర్తింపును ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇండియా మ్యాపును మార్చారన్నారు. బోనాల సమయంలో బోనంపై జై తెలంగాణ అని రాసుకొందామని మన సంస్కృతి,యాస, భాషలను ప్రజల్లోకి తీసుకువెళ్దామన్నారు.